నీలగిరి, జూలై 13 : కర్నాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు నిషేధిత గుట్కాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.పది లక్షల విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఏవీ రంగనాథ్ కేసు వివరాలను వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు నల్లగొండ టాస్క్ఫోర్స్ పోలీసులు నార్కట్పల్లి మండలంలోని గోపలాయపల్లిలో యాద ఆంజనేయులు కిరాణం షాపును తనిఖీ చేయగా ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు దొరికాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించి నల్లగొండకు చెందిన భానుప్రసాద్ అలియాస్ శివను పట్టుకొన్నారు. వారి వద్ద ఉన్న గుట్కా నిల్వలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రసాద్, ఆంజనేయుల సమాచారం మేరకు నల్లగొండ మండలం మర్రిగూడలోని కిరాణం దుకాణాలు, పాన్షాపుల్లో గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.
వీరిని విచారించగా హైదరాబాద్లోని జీడిమెట్లలో భావర్ ఖాన్, విజయ్ గోయల్ అగర్వాల్తోపాటు మరికొంత మంది నుంచి గుట్కా కొనుగోలు చేసినట్లు, వీరు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి దిగుమతి చేస్తున్నట్లు తేలింది. జీడిమెట్ల కేంద్రంగా సాగుతున్న దందాల్లో మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. వారు ఉపయోగిస్తున్న 11 సెల్ఫోన్లు, గుట్కా రవాణాకు వాడే ఆటో, మోటార్ సైకిల్, డిజైర్ కారును సీజ్ చేశారు. 65 బస్తాల నిషేధిత గుట్కా ఉత్పత్తులైన మీరజ్, అంబర్, స్వాగత్ గోల్డ్, లోకల్ వి-1, విమల్, సాగర్, ఎస్ఆర్-1 తదితర ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కల్గించే పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు జరిపితే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, టాస్క్ఫోర్స్ సీఐ సయ్యద్ మహబూబ్ బాషా, నల్లగొండ వన్టౌన్, టూటౌన్ సీఐలు బాలగోపాల్, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.