కిడ్నీ బాధితులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. స్థానికంగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తున్నది. హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లి చికిత్స చేసుకునే బాధ నుంచి ఊరట కలిగిస్తున్నది. జిల్లా కేంద్రాలతోపాటు, నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 8 కేంద్రాలు ఉండగా తాజాగా భువనగిరి ఏరియా దవాఖానలో సెంటర్ సిద్ధమైంది. ఐదు యంత్రాలతో బెడ్లు ఏర్పాటు చేయగా సోమవారం మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించనున్నారు. నల్లగొండ జనరల్ దవాఖానలో 10 పడకలు,మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ, చౌటుప్పల్లో 5 పడకలతో ప్రస్తుతం డయాలసిస్ సెంటర్లు నడుస్తున్నాయి. వీటిల్లో ఒక్కో యంత్రం ద్వారా రోజుకు 5 నుంచి 6 మంది చొప్పున 225 నుంచి 250 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఒక్కో బాధితుడికి ప్రభుత్వం నెలకు లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నది. వీటితో పాటు ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డయాలస్ సెంటర్ను కొనసాగిస్తున్నారు.
నీలగిరి, ఫిబ్రవరి 12 : కాలానుగుణంగా మారిన జీవన విధానంతో అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారు. చికిత్స పొందేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మూత్రపిండాలు చెడిపోయిన వారు డయాలసిస్ చేయించుకోవడానికి పడే అవస్థలు వర్ణనాతీతం. జిల్లాలో డయాలసిస్ సెంటర్లు లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లడం, ప్రైవేటు దవాఖానల్లో వేల రూపాయలు ఖర్చు అవుతుండడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. జిల్లాలో గతంలో నల్లగొండ, సూర్యాపేటలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండగా.. నార్కట్పల్లిలోని కామినేని దవాఖానలో మరొకటి ఉంది. ఈ క్రమంలో డయాలసిస్ కోసం హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.
కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వాటిల్లో ప్రతిరోజూ ఉచితంగా రక్త శుద్ధి చేస్తుండడంతో రోగులు ఉపశమనం పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వ్యయ, ప్రయాసల కష్టాలు తీరాయి. నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సుమారు కోటిన్నర రూపాయలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో జిల్లా ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 8 డయాలసిస్ సెంటర్లు ఉండగా.. భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మరో డయాలసిస్ సెంటర్ సోమవారం ప్రారంభం కానున్నది. నల్లగొండ జనరల్ ఆసుపత్రిలో 10 పడకలతో, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ, చౌటుప్పల్లో ఐదు పడకలతో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వాటిల్లో ప్రతి రోజూ 200 నుంచి 250 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటలపాటు అందుబాటులో ఉంటూ రోగులకు ఐదు షిఫ్టుల్లో రక్తాన్ని శుద్ధి చేసి పంపుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో రోజుకు సుమారు 225 నుంచి 250 మందికి డయాలసిస్ చేస్తున్నారు.
గతంలో ఇక్కడ సెంటర్ లేకపోవడంతో హైదరాబాద్కు వెళ్లి డయాలసిస్ చేయించుకునేవారు. రాకపోకలకు 5గంటలు, డయాలసిస్కు 4గంటలు, వెయిటింగ్ 2నుంచి మూడు గంటల చొప్పున రోజంతా గడిచిపోయేది. ఇప్పుడు స్థానికంగా డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని రోగులు చెబుతున్నారు. ప్రతి రోగికి నెలకు సుమారు ఆరు వేల విలువైన రక్తం, ఐరన్ ఇంజక్షన్తోపాటు కిట్ను వాడుతుండడంతో ఒక్కో రోగికి ప్రభుత్వం నెలకు సుమారు లక్ష రుపాయల వరకు ఖర్చు చేస్తున్నది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి రోజూ 225 మందికి తగ్గకుండా 250 మందికి మించకుండా డయాలసిస్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 1,550 మంది వరకు డయాలసిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో సుమారు వంద మంది ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా డయాలసిస్ చేయించుకుంటున్నారు. జిల్లాకు 10 మిషన్లు రాగా.. అందులో 8 మిషన్లు సాధారణ వ్యక్తులకు, ఒకటి హెచ్ఐవీ, మరొకటి హైపటైటిస్ వ్యాధిగ్రస్తులకు కేటాయించి వైద్య సేవలు అందిస్తున్నారు.
మిగతా ప్రాంతాల్లో నాలుగు మిషన్లు సాధారణ రోగులకు, ఒకటి హెచ్ఐవీ, మరో మిషన్ హైపటైటిస్ వ్యాధిగ్రస్తులకు కేటాయించారు. ఒక్కో రోగికి 4గంటల పాటు డయాలసిస్ నిర్వహిస్తారు. దీంతో రోజుకు 225 మందికి డయాలసిస్ చికిత్స అందుతుంది. జిల్లాలో మొదటిసారిగా నల్లగొండ జిల్లా కేంద్రంలో గత ఏడాది ఆగస్టు 16న ప్రారంభం కాగా మిగతా ప్రాంతాల్లో పలు దఫాల్లో డయాలసిస్ సేవలు ప్రారంభమయ్యాయి. డయాలసిస్ రోగులు వారానికి రెండు, మూడు సార్లు రక్తశుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 12 : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతి రోజూ 30 మందికి డయాలసిస్ సేవలు అందించేందుకు వీలుగా మెడికల్ ఎక్విప్మెంట్ను సిద్ధం చేశారు. డయాలసిస్ రోగుల సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ప్రభుత్వం స్థానిక ఏరియా దవాఖానలో ఐదు మిషన్లతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఈ సెంటర్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ఈ సెంటర్ ప్రారంభమైతే అత్యాధునిక వసతులతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స ఉచితంగా అందుతుంది. డయాలసిస్ చేయించుకునే వారు ఆరోగ్యశ్రీ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని ఉచితంగా సేవలు పొందవచ్చు.
భువనగిరి ఏరియా దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో నియోజకవర్గంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు దూర ప్రాంతాలకు వెళ్లలేక, ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో ఎంతో మంది మృతిచెందారు. కొన్ని సందర్భాల్లో డయాలసిస్ పేషెంట్లు చెప్పిన మాటలు వింటుంటే కంట నీరు వచ్చేది. భువనగిరిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తే పేదలకు అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. అనుకున్న సమయం కంటే ముందే సెంటర్ అందుబాటులోకి రావడం, ప్రారంభించడం సంతోషం. డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– పైళ్ల శేఖర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే