బంజారాహిల్స్, జనవరి 18 : పుట్టుకతో వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులకు జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి వైద్యులు సాహి స్వచ్ఛంద సంస్థ సహకారంతో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. బుధవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాక్లియర్ ఇంప్లాంట్ క్లినిక్ హెచ్ఓడీ ఈసీ వినయ్కుమార్ మాట్లాడుతూ మిర్యాలగూడకు చెందిన ఆలకుంట సీతారాములు, మమత దంపతుల ధరణి(3), పవిత్ర(4), మాస్టర్ అర్జున్(5) సంతానం. వీరు పుట్టుకతోనే వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిని పరీక్షించిన వైద్యులు కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు.
అయితే నిరుపేద అయిన సీతారాములు చికిత్సకు అవసరమైన డబ్బులు లేక సాహి స్వచ్ఛంద సంస్థను సంప్రదించాడు. దాంతో సంస్థ సహకారంతో ముగ్గురు చిన్నారులకు ఈ నెల 12న ఏకకాలంలో కాక్లియర్ శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం చిన్నారులు కోలుకున్నారని, జీవితంలో తొలిసారిగా శబ్దాలను వినగలుగుతున్నారని డాక్టర్ వినయ్కుమార్ తెలిపారు. పుట్టుకతోనే వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారులకు నాలుగేళ్లలోపే చికిత్స అందిస్తే దానిని సరి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ రవీందర్బాబు, డా.రాంబాబు పాల్గొన్నారు.