నల్లగొండ సిటీ, ఏప్రిల్ 27: ఆర్టీసీపైనా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు బస్సులో ప్రయాణించేదుకు వెనుకంజ వేస్తున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ రేషియో తగ్గుతున్నది. అవసరానికి తప్పనిసరిగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే వ్యక్తిగత వాహనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అనేక మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. వాస్తవానికి నిత్యం ఉమ్మడి జిల్లాలో రూ.90 లక్షలకు పైగా ఆదాయం రావాల్సి ఉండగా రూ.50 నుంచి 55లక్షలలోపే వస్తుంది.
రాత్రిళ్లు నడువని బస్సులు…
ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, నార్కట్పల్లి, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట డిపోలు వున్నాయి. మొత్తం 735 బస్సులు ఉండగా అందులో 445 ఆర్టీసీ బస్సులు, 290 అద్దె బస్సులు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ రూ. 90 లక్షల ఆదాయం వస్తువుండగా కరోనా ప్రభావంతో ప్రసుత్తం రూ. 50 నుంచి 55లక్షల వరకే వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా విజృంభణతో 15రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతోపాటు మరణాల రేటు సైతం బాగా పెరుగుతున్నందున ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు రాత్రి కర్ఫ్యూ విధించడంతో బస్సుల రాకపోకలపై ప్రభావం పడింది.
ఆదాయం తగ్గింది…
కరోనా కారణంగా ప్రయాణికుల రద్దీ తగ్గింది. కరోనా భయానికి బస్సులను ఎక్కడం లేదు. అవసరమైతే సొంత వాహనాల్లో వెళ్తున్నారు. ప్రయాణికులు రాక పోవడంతో ఆర్టీసీ ఆదాయం సగానికి పైగా తగ్గింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్రాష్ట్ర సర్వీసులను యథావిధిగా నడుపుతున్నాం.
-శ్యామల, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్, నల్లగొండ