హరిద్వార్: ఉత్తరాఖండ్లోని కుంభమేళాలో పాల్గొన్న మరో మఠాధిపతి కరోనా బారినపడి చికిత్స పొందుతూ మరణించారు. శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీకి చెందిన శ్రావణ్ నాథ్ మఠాధిపతి, జవహర్ లాల్ నెహ్రూ కాలేజ్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడైన శ్రీ మహంత్ లఖన్ గిరి ఈ నెల 1న ప్రారంభమైన కుంభమేళాలో పాల్గొన్నారు. ఆయనకు కరోనా సోకడంతో మూడు వారాలుగా అనారోగ్యంతో ఉన్నారు.
మహంత్ లఖన్ గిరిని తొలుత జగ్జీత్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కరోనా పాజిటిటివ్గా నిర్ధారణ కావడంతో పది రోజుల కిందట రిషికేశ్లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మరణించారు.
హరిద్వార్ కుంభమేళాలో పాల్గొని కరోనా బారినపడి చనిపోయిన మఠాధిపతుల్లో లఖన్ గిరి నాలుగో వ్యక్తి. శుక్రవారంతో ముగియనున్న ఈ కుంభమేళాలో సుమారు 91 లక్షలకుపైగా భక్తులు పాల్గొని గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు.