ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 25: ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగంలో పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ చింతల యాదయ్య (70) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ప్రముఖ జానపద సాహిత్య పరిశోధకుడిగా ఆయన విశేష ఖ్యాతిని ఆర్జించారు. ప్రస్తుతం తెలంగాణ బైండ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓయూ తెలుగు విభాగంలో పీజీ పూర్తి చేసిన అనంతరం పరిశోధన పూర్తి చేశారు. తర్వాత 1989 జూన్లో ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. తన అమూల్యమైన సేవలతో ఓయూ తెలుగు విభాగం అభివృద్ధికి పాటుపడ్డారు. యాదయ్య సారథ్యంలో ఎందరో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడ్డారు. ఆయన రూపొందించిన పరిశోధనా గ్రంథాలైన ‘జానపద విజ్ఞానంలో బవనీలు – పరిశీలన’, ‘నల్లగొండ జిల్లా జాతరలు’ ఇప్పటికీ ఎందరో పరిశోధకులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. నిజాం కళాశాల తెలుగు విభాగం హెడ్గా పనిచేసిన యాదయ్య 2008లో పదవీ విరమణ చేశారు. బీబీనగర్ మండలం ఎంకిర్యాలకు చెందిన ఆయన ప్రస్తుతం దిల్సుఖ్నగర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. కాగా, ఆదివారం ఉదయం 5.15 గంటలకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఓయూ తెలుగు విభాగం హెడ్ ప్రొఫెసర్ సూర్యాధనుంజయ, ప్రొఫెసర్ వెలిదండ నిత్యానందరావు, డాక్టర్ కాశిం, డాక్టర్ సాగి కమలాకరశర్మ, డాక్టర్ వారిజారాణి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రఘు తదితరులు నివాళులర్పించారు.