కరోనా కలకలం తగ్గాక.. పూర్తి స్థాయిలో థియేటర్లు కళకళలాడింది అంటే 2022లోనే! ఈ ఏడాది హీరోలు రికార్డు విజయాలు సాధించారు. వాళ్ల సరసన గెలుపులో భాగం పంచుకున్నారు హీరోయిన్లు. వరుస విజయాలతో ఒకరు, ప్రయోగాత్మక చిత్రాలతో మరొకరు, ప్రత్యేక పాత్రలో ఇంకొకరు.. ప్రేక్షకులను అలరించారు. కొత్త భామలు ఎందరు వచ్చినా.. ఈ ఏడాది ఎక్కువగా పాత తారలే తళుకులీనారు. ఆ విశేషాలు..
మరో విజయం కోసం..
‘మహానటి’ చిత్రం తర్వాత ఆ స్థాయి విజయం లేక సతమతమవుతున్నది కీర్తి సురేశ్. ఈ ఏడాది ఆమె నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ‘గుడ్లక్ సఖీ’ పరాజయం మూటగట్టుకుంది. మహేశ్బాబుతో నటించిన ‘సర్కారువారి పాట’ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. అయితే, ఈ సినిమాలో కీర్తి నటన అబ్బురపరిచింది. మహేశ్ సరసన అందంగా కనిపించింది. డ్యాన్సుల్లోనూ తన సత్తా చూపించింది. దీంతో సినిమా ఫలితం ఎలా ఉన్నా.. కీర్తికి మాత్రం మంచిపేరే వచ్చింది. ఈ ఏడాది తమిళం, మలయాళంలోనూ ఒక్కో సినిమా చేసింది.
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న భారీ విజయం వచ్చే ఏడాది సొంతమవుతుందని ఆశిస్తున్నది కీర్తి. 2023లో విడుదల కానున్న ‘దసరా’ సినిమాతో తన ఆశ తీరుతుందని నమ్మకంతో ఉంది. ‘భోళాశంకర్’ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించే చాన్స్ కొట్టేసింది. తమిళ చిత్రం ‘వేదళం’ దీనికి మాతృక. ‘వేదళం’తో పోలిస్తే ‘భోళాశంకర్’లో కీర్తి పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్.
జోరు తగ్గని నయన్
ఏ రంగంలో అయినా కొత్త నీరు రాగానే పాత నీరు వెళ్లిపోతుంది! ఈ సూత్రం సినీరంగానికి మరింత బాగా నప్పుతుంది. కథానాయిక కెరీర్ పదేండ్లు కొనసాగితే అద్భుతంగా భావించే రోజులివి. అలాంటిది, దాదాపు 18 ఏండ్లుగా నయనతార బాగానే నెట్టుకొస్తున్నది. అడపాదడపా హిట్టుకొడుతూ తన కెరీర్కు కామాలే కానీ, ఫుల్స్టాప్లు ఉండవంటున్నది. ఈ ఏడాది ఆమె నాలుగు సినిమాల్లో కనిపించింది. ‘కణ్మణి రాంబో ఖతీజా’లో విజయ్ సేతుపతి ప్రియురాలిగా అలరించింది. సమంతతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘ఓ2’ ప్రయోగాత్మక చిత్రంగా పేరు తెచ్చుకుంది.
చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ఫాదర్’ సినిమాలో ఆయనకు చెల్లెలుగా, రాజకీయ నాయకురాలిగా హుందాగా కనిపించింది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ సన్నివేశాల్లో నయనతార చూపించిన అభినయం ఈ సినిమాకు అదనపు బలాన్నిచ్చింది. తాజాగా ‘కనెక్ట్’ సినిమాతో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. వచ్చే ఏడాది ‘జవాన్’ అనే హిందీ చిత్రంతోపాటు ఆమె నటించిన మరో మూడు తమిళ సినిమాలు విడుదల కానున్నాయి.
ప్రయోగాల వేళ ఇది
హీరోయిన్గా సమంత పుష్కర కాలం పూర్తి చేసుకుంది. అందంతో, అభినయంతో తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్న ఈ కేరళ సోయగం కొన్నాళ్లుగా ప్రయోగాత్మక సినిమాల్లో నటించడానికి మొగ్గుచూపుతున్నది. గతేడాది ‘ద ఫ్యామిలీమ్యాన్-2’ వెబ్సిరీస్లో ఉగ్రవాదిగా నటించి మెప్పించింది. ఈ ఏడాది సమంత నటించిన సినిమాలు రెండే విడుదలయ్యాయి. అందులో ఒకటి తమిళ డబ్బింగ్ చిత్రం ‘కణ్మణి రాంబో ఖతీజా’.
ఇందులో ఖతీజాగా ఆమె కనిపించిన తీరు పాత సమంతను గుర్తుచేసింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లో సో.. సోగా ఆడినా.. ఓటీటీలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏడాది చరమాంకంలో విడుదలైన ‘యశోద’ సినిమా మంచి కలెక్షన్లు సాధించింది. ప్రయోగాత్మక చిత్రంగా పేరు తెచ్చుకుంది. వచ్చే ఏడాది కూడా సమంత జోరు ఇలాగే కొనసాగనుంది. ఆమె కథానాయికగా నటించిన ‘శాకుంతలం’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ సినిమాలోనూ నటిస్తున్నది. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
2023 శ్రీవల్లిదే!
2021 చివర్లో విడుదలైనా ఈ ఏడాది ప్రథమార్ధాన్ని శాసించిన పాట ‘చూపే సింగారమాయెనే శ్రీవల్లి..’! ఈ పాట ఎంతగా అలరించిందో శ్రీవల్లి పాత్రలో అలరించిన రష్మిక అంతలా మైమరపించింది. ‘పుష్ప’ సినిమా సక్సెస్తో 2022లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ కస్తూరి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు చవిచూసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం విజయవంతం కాకపోవడంతో ఆమె కొంత నిరుత్సాహానికి గురైంది. తర్వాత విడుదలైన ‘సీతారామం’ సినిమా రష్మిక ఖాతాలో మంచి విజయాన్ని చేర్చింది. అంతేకాదు ఈ ఏడాది అమితాబ్తో నటించే జాక్పాట్ కూడా కొట్టేసింది.
‘గుడ్బై’ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన రష్మిక మొదటి సినిమాలో అమితాబ్కు కూతురుగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో బాలీవుడ్లోనూ ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. 2023లో ‘పుష్ప 2’తోపాటు బాలీవుడ్లో ‘మిస్టర్ మజ్ను’, ‘యానిమల్’ చిత్రాలు విడుదల కానున్నాయి. మొత్తానికి వచ్చే ఏడాది రష్మిక కెరీర్ పీక్ స్టేజ్లో ఉంటుంది అనడంలో సందేహం లేదు.