దుండిగల్,సెప్టెంబర్ 22 : పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నేత శంభీపూర్రాజు అన్నారు. ఇటీవల నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన వాకలపూడి రంగరాయప్రసాద్, దుండిగల్ మున్సిపాలిటీ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన మద్దికుంట సంజీవరెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన మాసాని రవీందర్యాదవ్, అదే విధంగా జగద్గిరిగుట్ట, సూరారం, సుభాశ్నగర్ డివిజన్ల కమిటీలతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన బస్తీకమిటీల ప్రతినిధులు ఎమ్మెల్సీ రాజును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి పూలబొకే అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికోసం కష్టపడి పనిచేసిన ప్రతికార్యకర్తకు తగిన గుర్తింపు దక్కుతుందన్నారు. పదవులు పొందిన నేతలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. విపక్షాలు చేసే అసత్యప్రచారాలను ప్రజాక్షేత్రంలోనే తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిఫ్యూటీ మేయర్ ధన్రాజు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొలన్ గోపాల్రెడ్డి, జగద్గిరిగుట్ట, సూరారం డివిజన్ల కార్పొరేటర్లు జగన్, సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేశ్రెడ్డి, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభీపూర్కృష్ణ తదితరులతో పాటు పెద్దసంఖ్యలో నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.