ఘట్కేసర్ రూరల్, జూలై 15 : ఘట్కేసర్ పూర్వ మండలం పరిధిలో ప్రజల దాహార్తి తీరనుంది. బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లతో పాటు పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీలు, మండలంలోని పంచాయతీల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.120 కోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా తెలుసుకున్న సమస్యలను ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గురువారం మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వినతిపత్రం అందజేశారు. మండల పరిధిలోని కాచవానిసింగారం, కొర్రెముల, చౌదరిగూడ, వెంకటాపూర్ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు వివరించారు.
మూసీనది సమీపంలో ఉన్న గ్రామాలకు తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, పనులు ప్రారంభించి పైపులైన్ వేయడంతో పాటు ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి సీఎం కేసీఆర్ అనుమతితో రూ.120 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటు తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య నివారణకు నిధులు కేటాయించటం పట్ల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కందుల కుమార్, ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు, వెంకటాపూర్ ఉప సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు, శ్రీనివాస్, హరి పాల్గొన్నారు.
శామీర్పేట : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రోడ్డు రవాణా వ్యవస్థలో సమూలమైన మార్పును ప్రభుత్వం తీసుకువస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మూడుచింతల్పల్లి మండలం కేశ్వాపూర్-ఉద్దెమర్రి లింకు రోడ్డు, పొన్నాల్ రోడ్డుకు గురువారం నిధుల మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమం లో సర్పంచ్ ఇస్తారి, మురళీగౌడ్, గణేశ్రెడ్డి, విజయ్కుమార్, రమేశ్, లక్ష్మీనారాయణ, రాంరెడ్డి పాల్గొన్నారు.