మల్లాపూర్, మే 15 : కరోనా వ్యాధి అనుమానం… నిండు గర్భిణి ప్రాణాలు తీసింది. పలు హాస్పిటల్ల్లో చికిత్సకు నిరాకరించడంతో చివరకు కోఠి ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్లోనే కన్నుమూసింది. కరోనా అనుమానం తల్లీబిడ్డలను బలితీసుకుంది. ఈ సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. కరోనా అనే అనుమానంతో 8 నెలల గర్భిణిని ఆసుపత్రుల్లో చేర్చుకోక పోవడంతో ఆమె చివరికి ప్రాణాలు వదిలింది. కాప్రా సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ నాగలక్ష్మినగర్లో నివాసముండే జోగారావు, నీలవేణిల కుమార్తే పావని(21)కి గత ఏడాది వివాహం జరిగింది. కాగా.. పావని 8 నెలల గర్భవతి కావడంతో తల్లిదండ్రులు 14 రోజుల క్రితం మల్లాపూర్లోని పుట్టింటికి తీసుకువచ్చారు. పావనికి శుక్రవారం ఉదయం ఆయసం రాగా తల్లిదండ్రులు తాము చూపిస్తున్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కొవిడ్ అనే అనుమానంతో ఆసుపత్రి వర్గాలు ఆమెకు చికిత్సను నిరాకరించడంతో నగరంలోని పలు ఆసుపత్రులను ఆశ్రయించినా అదే పరిస్థితి నెలకొనడంతో కోఠి ప్రసూతి ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలోనే పావని మరణించింది.
పావని మృతదేహాన్ని శుక్రవారం రాత్రి మల్లాపూర్కు తీసుకువచ్చారు. పావని దహన సంస్కారాల కోసం మల్లాపూర్ హిందూ శ్మశాన వాటికకు వెళ్లిన కుటుంబ సభ్యులకు మరో ఘటన ఎదురైంది. దహన సంస్కారాలకు సిద్ధం చేస్తుండగా, నిండు గర్భిణిని దహన సంస్కారం చేయడం అరిష్టమని శ్మశానవాటిక నిర్వాహకులు చెప్పడంతో పావని కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తల్లీబిడ్డను వేరు చేస్తేనే దహన సంస్కారాలు చేస్తామని, ఒక వేళ అలాగే చేస్తే ఊరికే అరిష్టమని శ్మశాన వాటిక నిర్వాహకులు తెలిపారు. దీంతో పావని కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం ఆసుపత్రికి వెళ్లి తల్లి బిడ్డను వేరు చేసి తీసుకువచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు దహన సంస్కారాలు చేపట్టారు. పావనికి దహన సంస్కారాలు చేయగా, శిశువుని పూడ్చి పెట్టారు. శ్మశాన వాటికలో అంత్యక్రియల కోసం ఎవరికైనా రూ. 6.500 తీసుకుంటారు. కానీ..కాటికాపరి బ్యాగరి రమేశ్ మరణించిన పావని తన సొంత చెల్లెలుగా భావించి, వారి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకోకుండానే అంత్యక్రియలు పూర్తి చేశాడు.