పటాన్చెరు, మార్చి 1 : పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువత నైపుణ్యాలను నేర్చుకుని సిద్ధం కావాలని, అందివస్తున్న ఆధునిక సాంకేతికతపై పట్టుసాధించాలని పలు పరిశ్రమలకు చెందిన ఉన్నతాధికారులు సూచించారు. శుక్రవారం గీతం వర్సిటీలో కెరీర్ గైడెన్స్ కేంద్రం ఆధ్వర్యంలో గీతం ఇండస్ట్రియల్ కాంక్లేవ్ -1.0ను ఏర్పాటు చేశారు. ఇందులో పలు ప్రముఖ పరిశ్రమలు, సాఫ్ట్వేర్ కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు.
నీమెట్ స్కెచ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విశాల్మణి మాట్లాడుతూ.. పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు గీతం వర్సిటీ కాంక్లేవ్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. బాహ్య (పరిశ్రమ), సొంత నైపుణ్యాలపై కెరీర్ పురోగతి ఆధారపడి ఉంటుందని తెలిపారు. పరిశ్రమల డిమాండ్కు తగ్గట్టుగా నైపుణ్యాలను సమకూర్చుకోవాలని కోరారు. ఏటీఎంఈసీఎస్లో సీనియర్ ఉపాధ్యక్షుడు (ఇంజినీరింగ్) సంజయ్సింగ్ మాట్లాడుతూ.. కృత్రిమమేధ ద్వారా ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నంలో 75శాతం పరిశ్రమలు ఉన్నట్లు తెలిపారు. ఏఐ ద్వారా 2030 నాటికి మూడు కోట్ల ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. రాబోయే పదేళ్లలో కోడింగ్ ప్రాధాన్యత తగ్గిపోతుందన్నారు. ఛాట్ జీపీటీలో నైపుణ్యాలను సమకూర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఏపీఐ, ఫ్రేమ్ వర్క్లతో ఎలా పనిచేయాలో నేర్చుకోవాలన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పట్టభద్రులు ఉన్నత విద్యాభ్యాసం చేయడం ఉత్తమమన్నారు. సిగ్నిటి టాలెంట్ అక్విజినేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు కరుణా వెంపల, కాలిన్స్ ఏరోస్పేస్ అసొసియేట్ డైరెక్టర్ జైపాల్సింగ్, ఏటీఎంఈసీఎస్ సీనియర్ డైరెక్టర్ (ఇంజినీరింగ్, భానుప్రకాశ్, గ్లోబల్ మానవ వనరుల విభాగాధిపతి నరేన్ గుండాబత్తుల, గీతం కోర్ ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి మాట్లాడుతూ.. పరిశ్రమల అమసరాలు, డిమాండ్కు అనుగుణంగా విద్యార్థులు కోర్సులు, నైపుణ్యాలను నేర్చుకోవాలని కోరారు. కాంక్లేవ్లో కెరీర్ గైడెన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాతి వేణుకుమార్, కెరీర్ ఫుల్ ఫిల్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.