సిద్దిపేట అర్బన్, జనవరి 8 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ ఉపాధ్యాయ, అధికార వర్గాలను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని ఎంఈవో, ఎంఎన్వో, సీహెచ్ఎంలు, ఉపాధ్యాయ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వార్షిక పరీక్షలు ముగిసే వరకు ఏ ఒక్క ఉపాధ్యాయుడు సెలవు తీసుకోకుండా పని చేయాలని సూచించారు. జిల్లా విద్యాధికారి మొదలు మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, ఉపాధ్యాయులు సైతం వార్షిక పరీక్షలు ముగిసే వరకు నెలా వారీగా టూర్ డైరీని తయారు చేసుకొని తమ సంతకంతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
విద్యార్థుల హాజరు శాతం, ఇతరత్రా వివరాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జిల్లాను పది ఫలితాల్లోఅగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఉపాధ్యాయుడు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఎంఈవో తమకు కేటాయించిన పాఠశాలలను విజిట్ చేసి బోధన, మధ్యాహ్న భోజనం, ఇతరత్రా అంశాలను పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ భాస్కర్ పాల్గొన్నారు.