చేగుంట, మే 24: ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలని, కొనుగోళ్లు పూర్తయ్యేవరకు ప్రతి సెంటర్ పనిచేస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. చేగుంట మండలంలోని వడియారంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వడియారం కేంద్రంలో కొనుగోళ్లు త్వరగా పూర్తి చేసి రైస్ మిల్లుకు తరలించాలని ఆదేశించారు. జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 2,35,222,040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 54,246 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.38243 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. 148 కేంద్రాల్లో ధాన్యం పూర్తయిందని, మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరగా కొనుగోలు చేసి రైస్మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లాలోని 34 బాయిల్డ్, 31రా మిల్లులకు ధాన్యం కేటాయించామన్నారు. కొనుగోళ్లు వేగవంతం కోసం సిద్దిపేట జిల్లాకు పదివేల మెట్రిక్ టన్నులు, మహబూబ్నగర్ జిల్లాకు 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంపించామని చెప్పారు. మరో 10వేల మెట్రిక్ టన్నులకు ఆర్డర్ వచ్చిందన్నారు. ఆరు వందలకుపైగా లారీలు అందుబాటులో ఉన్నాయని, వీటితోపాటు ఇతర జిల్లాల నుంచి 150 లారీలను తెప్పించామని కలెక్టర్ చెప్పారు. పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ గియానిస్సా బేగం, ఎంపీడీవో చెన్నారెడ్డి తదితర అధికారులు ఉన్నారు.