నంగునూరు, మార్చి 11 : సాగునీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద సోమవారం హన్మకొండ-సిద్దిపేట రహదారిపై రైతులు భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, రెండు రోజుల్లో సాగునీరు అందకుంటే పంటలు పూర్తిగా ఎండిపోయి నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి పెద్దవాగులోకి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజగోపాల్పేట ఎస్ఐ భాస్కర్రెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు సముదాయించారు.
రైతుల ఆందోళన విషయాన్ని ఎస్సై భాస్కర్రెడ్డి ఇరిగేషన్ డీఈఈ చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. అరగంట పాటు రాస్తారోకోతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ధర్నాలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, సొసైటీ చైర్మన్ కోల రమేశ్గౌడ్ రైతులకు మద్దతు తెలిపారు.