
మెదక్, డిసెంబర్ 17 : ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రత కోసం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో గోదాంలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్గోయల్ అన్నారు. శుక్రవారం మెదక్లో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ సముదాయంలో రూ.కోటీ 5లక్షల వ్యయంతో నిర్మించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల గోదాంను మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఓటింగ్, కౌంటింగ్కు ఈవీఎంలు కీలకమైనవని, ఎలక్షన్ కమిషన్ కూడా ఈవీఎంల భద్రత కోసం దృష్టి సారించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకారం ఈవీఎం గోదాంలు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మెదక్లో నిర్మించిన గోదాంలు ఫస్ట్ లెవల్ చెకింగ్ కోసం రూ.53 లక్షలతో హాల్ నిర్మాణానికి పంపిన ప్రతిపాదనలు పరిశీలించి మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ గోదాంలో నియోజకవర్గం వారీగా ఈవీఎంలు భద్రపర్చుకునేందుకు కప్బోర్డుతో పాటు కంపార్ట్మెంట్స్ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్అండ్బీ ఈఈ శ్యామ్సుందర్కు సూచించారు. ఈవీఎం గోదాంలు ఉండడంతో ఎన్నికలు వచ్చినప్పుడు భద్రంగా, సులభంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని, ఈవీఎంల గోదాంల వద్ద 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డు భద్రత ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. అనంతరం ఈవీఎం గోదాం ఆవరణలో హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్పీ చందనదీప్తి, డీఎస్పీ సైదులు, ఆర్అండ్బీ ఈఈ శ్యామ్సుందర్, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.