ఘనంగా వర్గల్ వేణుగోపాలస్వామి రథోత్సవం
భారీగా హాజరైన భక్తజనం
మార్మోగిన జైశ్రీమన్నారాయణ నామస్మరణ
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పాల్గొన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి
వేణుగోపాలస్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది.‘ జైశ్రీమన్నారాయణ.. జైశ్రీమన్నారాయణ’ అంటూ భక్తులు నీరాజనం పలికారు. పదిరోజుల పాటు జరిగిన యజ్ఞాది క్రతువులు రథోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. కోలాటాలు, డప్పువాయిద్యాలు, కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి రథోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
వర్గల్, మే 22: వర్గల్ పురవీధులు పునీతమయ్యాయి. సాక్షాత్తు మహావిష్ణువు అవతారమైన వేణుగోపాలస్వామి ఇరువురు భామలతో కలిసి లోకకల్యాణార్థం ఆదివారం ఊరేగింపులో భక్తులకు కనువిందు చేశారు. జై శ్రీమన్నారాయణ…జయ జయహో అంటూ భక్తులు నీరాజనం పలికారు. పదిరోజులపాటు జరిగిన యజ్ఞాది క్రతువులు రథోత్సవ ఊరేగింపుతో పరిసమాప్తమయ్యాయి. కోలాటాలు, డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలు, ప్రముఖుల దర్శనాలతో వర్గల్ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అలరించాయి. అంతకు ముందు స్వా మి వారి రథోత్సవ పూజ జరిగింది. అభిషేకాలు, అలంకారసేవలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టించారు. రథంపై కొలువుదీరిన దేవతామూర్తులను భక్తులు క్యూలైన్లో ఒక్కొక్కరు ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందనామస్మరణంతో ఒర్గంటి (వర్గల్)పురవీధులు మార్మోగాయి.
వేణుగోపాలుడి సేవలో ప్రముఖులు
వర్గల్ వేణుగోపాలస్వామి రథోత్సవంలో ప్రముఖులు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, రాష్ట్ర గొర్రెలకాపరుల సంక్షేమ సంస్థ మాజీ చైర్మన్ రాజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జడ్పీటీసీ బాలమల్లుయాదవ్, ఎంపీపీ లతారమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ వర్గల్ మండల అధ్యక్షుడు దేవగనిక నాగరాజు, గ్రామ సర్పంచ్ గోపాల్రెడ్డి, ఎంపీటీసీలు రాధాప్రవీన్గౌడ్, స్వాతి, ఆలయ ధర్మకర్తలు టేకులపల్లి రాంరెడ్డి, పొదుద్టూరి రాజుగుప్తా, టీఆర్ఎస్ నాయకులు స్వామివారిని దర్శించుకొని ఉత్సవ ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తుల కోసం అంబలికేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.