వర్గల్, ఫిబ్రవరి 24: సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేస్తున్నది. ఒత్తిడిలేని చదువులు, ఆటపాటలతో మానసిక ఉల్లాసానికి, విద్యా వికాసానికి కేంద్రంగా మారింది. ఆరో తరగతిలో అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి కళాశాల విద్య పూర్తయ్యే వరకు విద్యార్థులకు సకల వసతులు కల్పిస్తున్నారు. ఎందరో డాక్టర్లు, మరెందరో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ఇంకెందరో పోలీసు, మిలటరీ ఉద్యోగులు, సాంకేతిక నిపుణులు, కేంద్ర, రాష్ట్ర సర్వీసు ఉద్యోగులు ఇలా ఎందరినో అందించిన చరిత్ర వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయానికి ఉంది. పల్లెప్రాంతాల విద్యార్థుల్లో దాగి దాన్న ప్రతిభను వెలికితీసి బంగారు భవిష్యత్కు మార్గం చూపిస్తున్న వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంపై ప్రత్యేక కథనం..
అనుభవపూర్వక విద్యతో ఆరంభం
వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యాబోధన మొత్తం అనుభవ పూర్వక విధానం ( లెర్నింగ్ బై డూయింగ్)లో కొనసాగుతుంది. ఉపాధ్యాయులు ఏదైనా అంశం బోధించేటప్పుడు దానికి సంబంధించి ప్రాక్టికల్స్, ఫజిల్స్, క్విజ్ పోటీలు తదితర అంశాల ఆధారంగా నేర్పిస్తారు. ముఖ్యంగా సైన్స్తో పాటు, మ్యాథ్స్ లాంటి సబ్జెక్టుల్లో మెరుగైన బోధన చేస్తారు. తద్వారా ఆయా సబ్జెక్టుల్లో అర్థం కాలేదు అని చెప్పే విద్యార్థులు ఉండరు. సైన్స్ ఎగ్జిబిషన్, ప్రాక్టికల్స్ లాంటి ప్రదర్శనలు నిర్వహిస్తూ సక్సెస్ స్టడీకి నాంది పలుకుతున్నారు.
నవోదయకు ఎంపిక కావడం ఇలా…
జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి నుంచే ఎంపిక పరీక్షలు ఉంటాయి. ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ నుంచే ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తారు. డిసెంబర్, జనవరిలో ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. వయస్సు నిబంధన, 2022-23 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ మే1, 2011 ఏప్రిల్ 30 తేదీ 2013 మధ్యలో జన్మించిన వారు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. మొత్తం 80 సీట్లలో గ్రామీణ విద్యార్థులకు 75 శాతం కాగా మిగతా 25 శాతం ఆయా జేఎన్వీ పరిధిలోని పట్ణణ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. మొత్తం 100 మార్కులు ఉంటాయి మెంటల్ ఎబిలిటీ టెస్టు, అర్ధమెటిక్, లాంగ్వేజ్లకు సంబంధించిన అంశాల్లో పోటీ పరీక్ష ఉంటుంది.పరీక్షా విధానం మొత్తం ఆబ్జెక్టివ్, బహుళైశ్చిక ప్రశ్నా విధానంలో ఉంటుంది. ఈయేడు ఆరో తరగతిలో చేరేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 5691 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని, 29 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 29న అర్హత పరీక్ష ఉంటుందని వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ రమేశ్రావు తెలిపారు.
చక్కటి చదువులు, రుచికరమైన భోజన వసతి
వర్గల్ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో క్రమశిక్షణతో కూడిన విద్యా విధానమే కాకుండా రీడింగ్ క్లాసులు, ప్రాక్టికల్స్, అప్పుడప్పుడు కళాప్రదర్శనలతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచుతున్నారు. ఇతర రాష్ర్టాల్లో అమలవుతున్న విద్యా విధానాన్ని పరిశీలించేందుకు విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు టూర్ షెడ్యూల్ ఏర్పాటు చేస్తారు. భోజన వసతి చెప్పాలంటే విద్యార్థుల అభిప్రాయాల మేరకే రోజువారి మెనూ ఉంటుంది. రొటీన్గా భిన్నంగా వారికి ఇష్టమైన టిఫిన్, భోజనం వడ్డిస్తారు. పాలు, గుడ్లు, మాంసం, పండ్లు ఇలా సమీకృత పౌష్టికాహారం అందిస్తారు.
విద్యార్థుల అభివృద్ధికి కృషి
దేశంలోని ఇతర విద్యాసంస్థల కంటే జవహర్ నవోదయ విద్యాలయాల్లోని విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. నవోదయలో చదివిన వారు వివిధ సర్వీసు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చదువులో రాణింపు, వ్యక్తిగత శ్రద్ధ, నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదల, క్రీడా నైపుణ్యంలో శిక్షణ వర్గల్ నవోదయ విద్యాలయం ప్రత్యేకత. అడ్మిషన్ పొందినప్పటి నుంచి కళాశాల విద్య పూర్తయ్యే వరకు విద్యార్థుల అభివృద్ధికి కృషిచేస్తున్నాం.
– రమేశ్రావు, వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్
వర్గల్ నవోదయలో స్టడీ బాగుంది
మాది హర్యానా. మైగ్రేట్ విధానం ద్వారా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో చేరా. మొదట్లో తెలంగాణ యాస, భాష అర్థం కాలేదు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కొన్నిరోజులు ఇబ్బంది పడ్డా. ఇప్పుడు వర్గల్ నవోదయలో చదువుకుంటున్నందుకు గర్వపడుతున్నా. అమ్మానాన్నలకు దూరంగా ఉన్నాననే లోటులేకుండా ఉంది. తెలుగులో కూడా అర్థం చేసుకోవడమే కాకుండా మాట్లాడుతున్నా.
-గౌరవ్సోని, తొమ్మిదో తరగతి, హర్యానా
సీటు రావడం అదృష్టం
వర్గల్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు రావడం అదృష్టంగా భావిస్తున్నా. విద్యాబోధన అనేది ప్రాక్టికల్ ద్వారా ఉంటుంది. దీంతో అర్థం కాలేదు అంటూ ఏదీ ఉండదు. సమయపాలన, ఆటల్లో నైపుణ్యం, మానసిక ఉల్లాసం, అన్ని సబ్జెక్టుల్లో అర్థమయ్యే విధంగా బోధించడం వర్గల్ నవోదయ విద్యాలయం ప్రత్యేకత.
– అపూర్వ, తొమ్మిదో తరగతి