హుస్నాబాద్టౌన్, జూలై 31: అమ్మానాన్నలను కోల్పోయి నిలువ నీడలేక ఇద్దరు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన కత్తుల వెంకటయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇందులో మహేశ్ (15), రమేశ్(13) సంతానం. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఈ కుటుంబంలో అనారోగ్యం కారణంగా వెంకటయ్య 13 ఏండ్ల క్రితం మృతి చెందగా, తల్లి లక్ష్మి సైతం తొమ్మిదేండ్ల క్రితం మరణించింది.
అనాథలుగా..
చిన్నవయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న పిల్లలను వెంకటయ్య సోదరీమణులైన సలపాల కొమురవ్వ, లచ్చవ్వ వీరిని చేరదీసి కొంత ఆలనాపాలనా చూస్తున్నారు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే కొమురవ్వ, లచ్చవ్వలకు ఇద్దరు పిల్లలను పోషించడం ఆర్థిక భారంగా మారింది. వెంకటయ్య పెద్ద కుమారుడు మహేశ్ మానసిక ఎదుగుదల సరిగ్గా లేదు. చిన్నకొడుకు రమేశ్ చదువుకుంటూ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు.
గూడు సరిగ్గా లేక..
చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతోపాటు ఉండేందుకు సైతం గూడు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆర్థికసాయంతో ఇంటి నిర్మాణం చేపట్టినప్పటికీ పనులు గోడలవరకే పరిమితమయ్యాయి. దీంతో ఇద్దరు పిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇల్లు అసంపూర్తిగా ఉండటంతో ఇతరుల ఇండ్లల్లో తలదాచుకోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడు లేక పిల్లలు పడుతున్న అవస్థలను చూసి ఇరుగుపొరుగు వారు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఇల్లు పూర్తిచేసేందుకు దాతలు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని మహేశ్, రమేశ్ వేడుకుంటున్నారు. గూడుకోసం చేయూత అందించాలని మనసు ఉన్న మహరాజులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎవరైనా దాతలు ఖాతా నంబర్:
62116784131 (ఎస్బీఐ హుస్నాబాద్), ఐఎఫ్ఎస్సీ కోడ్
ఎస్బీఐఎన్0020362 లేదా
గూగుల్పే, ఫోన్పే నంబర్: 9703604151కు సహాయం చేయవచ్చు.