సంగారెడ్డి కలెక్టరేట్, మే 6: తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (టీఎస్ఆర్జేసీ)లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2,848 మంది విద్యార్థులకు గానూ ఉండగా, 2,434 మంది హాజరయ్యారు. దీంతో 85.46 శాతం హాజరు నమోదైంది.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు పరీక్ష జరుగగా, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీఎస్ఆర్జేసీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు.