జహీరాబాద్, జనవరి 7: మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండాలో బంజారాలు మూడు రోజులుగా నిర్వహిస్తున్న మోతిమాత జాతర శనివారం ఘనంగా ముగిసింది. గురువారం ఉత్సవాలు ప్రారంభమవగా మొదటి రోజు భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం జాతరకు తండాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని పూజలు చేశారు. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి జాతరకు భక్తులు అధికసంఖ్యలో పోటెత్తారు.
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, కలెక్టర్ శరత్లు జాతర ఏర్పాట్లపై అనేక సార్లు సమీక్షలు చేసి సలహాలు, సూచనలు చేయడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు సౌకర్యాలు కల్పించారు. పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా జహీరాబాద్ మున్సిపల్, పంచాయతీ, కార్మికులు పారిశుధ్య పనులు చేయడంతో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదు.
జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యంతో పాటు మరుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. గతంలో జారత వస్తే ఎన్నో ఇబ్బందులు ఉండేవని తెలంగాణ సర్కార్ వచ్చాక అన్ని వసతులు కల్పించిందని భక్తులు హర్షం వ్యక్త చేశారు. శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు జాతరలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పాట్లు చేశారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పలురకాల స్వీట్లు, వస్తువులు, కొనుగోలు చేశారు. ప్రతిరోజూ భక్తులకు అన్నదానం చేశారు. మోతిమాత జాతర వైభవంగా నిర్వహించడంతో గిరిజనులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.