మెదక్,(నమస్తే తెలంగాణ)/ రామాయంపేట రూరల్, సెప్టెంబర్ 20 : రైలు కల మెదక్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం. దశాబ్దాల కల నెరవేరబోతున్నది. సమైక్య పాలనలో మెదక్కు మొం డిచేయి చూపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెదక్కు రైల్వే లైన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మెదక్కు రైలు కూత వినిపించబోతున్నది. ఇప్పటికే గూడ్స్ రైళ్లు నడిపి ట్రయల్స్ నిర్వహించారు. రెండు నెలల క్రితం మెదక్ రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ ప్రారంభించారు. ప్యాసింజర్ రైలు రావడమే ఆలస్యం. మరో వారం రోజుల్లో పట్టాలెక్కనున్నది. దీంతో ఈ ప్రాంత ప్రజలు రైలు ప్రయాణం చేయవచ్చు.
ఏండ్ల స్వప్నం నెరవేరుతోంది..
మెదక్ ప్రాంత ప్రజలు కల నెరవేరబోతున్నది. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం తనవాటాగా రూ.85.75 కోట్లు ఖర్చుచేసింది. సమైక్య పాలనలో రైల్వే లైన్ శంకుస్థాపనలకే పరిమితమైంది. మెదక్ రైల్వేలైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రైల్వేలైన్ కోసం భూ సేకరణకు సహకరించిన రైతులకు కృతజ్ఞతలు. రెండు నెలల క్రితం మెదక్ రైల్వేస్టేషన్లో రేక్ పా యింట్ను మంత్రి హరీశ్రావు ప్రారంభించాం. వారం రోజుల్లో ప్యాసింజర్ రైళ్లను కూడా ప్రారంభిస్తాం. రైల్వే పనులకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, అందుకు సహకరించిన మంత్రికి ప్రత్యే క కృతజ్ఞతలు.
50 శాతం నిధులు రాష్ర్టానివే..
మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్కు ప్రభుత్వం 50 శాతం నిధులు వెచ్చించింది. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు మొత్తం 17.2 కిలోమీటర్లు కాగా, రూ.210.75 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వం 50 శాతం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.85.75 కోట్లు విడుదల చేసింది. 2014, జనవరి 19న ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన మెదక్లో రైల్వేలైన్ కోసం శంకుస్థాపన చేశారు. 2015 నవంబర్లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులను ప్రారంభించారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ పట్టణం వరకు 17.2 కిలోమీటర్ల దూరం రైల్వేలైన్ నిర్మా ణం పూర్తయింది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు గూడ్స్ రైళ్లతో ట్రయల్ రన్ నిర్వహించారు.
-పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
900 మంది రైతులకు రూ.16.84 కోట్ల పరిహారం..
అక్కన్నపేట నుంచి మెదక్ రైల్వేలైన్ కోసం రైతులు ముందుకొచ్చి తమ భూములను ఇచ్చారు. 900 మంది రైతులకు చెందిన 370 ఎకరాల భూములను రైల్వే లైన్ కోసం ఇవ్వగా, భూసేకరణ కోసం సీఎం కేసీఆర్ రూ.16.84 కోట్లు పరిహారం అందించారు. మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైల్వేలైన్ భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ పనుల విషయంలో ఎప్పటికప్పుడు రైల్వే శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. రైల్వేలైన్ భూ సేకరణకు సీఎం కేసీఆర్ రూ.16.84 కోట్ల పరిహారం ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.85.75 కోట్లు కేటాయించడంపై సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
అందరికీ రుణపడి ఉంటాం
అక్కన్నపేట-మెదక్ రైలు నడవడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సహకరించిన అందరికీ రుణపడి ఉంటాం. ఎన్నో సం వత్సరాలుగా ఎదురు చూస్తు న్నాం. అక్కన్నపేట స్టేషన్కు చుట్టు పక్కల చాలా గ్రామాల ఉన్నాయి. అన్ని గ్రామాల ప్రజలకు కేంద్ర బిందువుగా ఉన్న స్టేషన్కు ఆదాయం కూడా పెరుగుతున్నది. జిల్లా కేంద్రానికి వెళ్లే వారికి ప్రయాణం సులువుగా ఉండడంతో పాటు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి.
-జంగం నర్సవ్వ, అక్కన్నపేట, సర్పంచ్
ఎన్నో ఏండ్ల కల సాకారమవుతుంది
అక్కన్నపేట-మెదక్ రైలు ఎన్నో ఏండ్ల కల. తొందరలోనే రైలు ప్రారంభం అవుతుందని తెలి సి గ్రామస్తులం అందరం సంతోషపడుతున్నాం. గ్రామస్తులతో పాటు విద్యార్థులు, చిరు వ్యాపారుల ప్రయాణానికి ఎంతో సౌకర్యంగా ఉం టుంది. మా గ్రామానికి చెందిన చాలా మంది కూలీ పనుల కోసం రైలు మార్గంలోనే ప్రయాణిస్తారు. ఈ మార్గంలో వచ్చే రైలు తిరుగు ప్రయాణంలో కాచిగూడ వరకు వెళ్తుందని తెలిసింది. దీంతో చాలా మందికి సకాలంలో గమ్య స్థలానికి చేరడానికి వీలుంటుంది.
-యాదగిరి, అక్కన్నపేట
సంతోషంగా ఉంది
మా గ్రామం మీదుగా రైలు వెళ్లడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా కూరగాయలు అమ్ముకునే వారికి మెదక్ వెళ్లడానికి సులువుగా ఉంటుంది. ప్రతిరోజు ఆటోల్లో ప్రయాణించడంతో అమ్మిన కూరగాయల డబ్బులు సగం వరకు వాటికే పోతున్నాయి. రైలు మార్గంతో ఖర్చు తగ్గడంతో పాటు అధిక సంఖ్యలో కూరగాయలను మార్కెట్కు తరలించడానికి సౌకర్యంగా ఉంటుంది. సుమారు 10 గ్రామాల వారికి మేలు జరుగుతున్నది.
-ముస్తాల అనసూయ, లక్ష్మాపూర్
ముచ్చటగా మూడు స్టేషన్లు..
అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ మార్గంలో మూడు స్టేషన్లు ఏర్పాటు చేశారు. అక్కన్నపేట స్టేషన్ నుంచి ఈ రైలు మార్గం ప్రారంభమవుతున్నది. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్, హవేళీఘనపూర్ మండలంలోని శమ్నాపూర్తో పాటు జిల్లాకేంద్రం మెదక్లో రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేశారు. మెదక్ రైల్వేస్టేషన్ అద్భుతంగా నిర్మించారు. టిక్కెట్ కౌంటర్ గది, ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలు, పొడవైన్ ప్లాట్ఫాం, బాత్రూంలతో పాటు అత్యాధునికంగా ప్రయాణికుల అవసరాలకు తగ్గుట్టుగా స్టేషన్ను తీర్చిదిద్దారు. ఈ లైన్తో మెదక్ నుంచి అక్కన్నపేట, మిర్జాపల్లి మీదుగా సికింద్రాబాద్ రైల్వేలైన్కు అనుసంధానం చేశారు. మెదక్ నుంచి అక్కన్నపేట మీదుగా కాచిగూడకు వెళ్లవచ్చు.
రేక్ పాయింట్తో వేలాది మందికి ఉపాధి..
మెదక్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన రేక్ పాయింట్తో ఇక్కడి ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. జిల్లాకు చెందిన రైతులు, వ్యాపారులకు ప్రయోజనం కలుగనున్నది. ఎరువులు, పీడీఎస్ బియ్యం, పత్తి, సిమెంట్, స్టీల్ తదితర సామగ్రి ఎగుమతి, దిగుమతి చేసుకునేందుకు సులభతరమైంది. మెదక్ జిల్లా నుంచి ఏటా 5లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం హైదరాబాద్లోని సనత్నగర్ ఎఫ్సీఐ గోదాములకు లారీలతో తరలించేవారు. లారీలతో తరలించడం ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం రేక్ పాయింట్ అందుబాటులోకి రావడంతో రైళ్లతో సులభంగా బియ్యం రవాణా చేసు కోవచ్చు. మెదక్లో రేక్ పాయింట్కు దూర ప్రాంతాల నుంచి గూడ్స్ రైళ్లలో వచ్చే సరుకులను అన్లోడ్ చేసేందుకు, ఎగుమతి చేసే సమయంలో గూడ్స్ బోగీల్లో నిం పేందుకు స్థానికులకు ఉపాధి దొరుకుతుంది.