విద్యార్థులకు రైలులో చదువుతున్న అనుభూతి
తడ్కల్లో రైలు తరహాలో పాఠశాల భవనం పెయింటింగ్
1972 నెంబర్తో చైల్డ్ ఫ్రెండ్లీ ఎక్స్ప్రెస్గా నామకరణం
పాఠశాలకు రావడానికి ఇష్టపడుతున్న ప్రైవేట్ విద్యార్థులు
ఇంగ్లిష్ మీడియంతో మరింత పెరుగనున్న విద్యార్థుల సంఖ్య
ఆంగ్ల మాధ్యమంతో అడ్మిషన్లు పెరుగుతాయి..
కంగ్టి, ఫిబ్రవరి 3;ప్లాట్ఫాంలేని ట్రైన్ ఎక్కడైనా చూశారా..? ఇదేం ప్రశ్న అని ఆశ్చర్యపోతున్నారా..! అవును, మరి ప్లాట్ఫాంలేని రైలు ఇప్పుడు సంగారెడ్డి జిల్లా తడ్కల్ ప్రాథమిక పాఠశాలగా కనువిందు చేస్తున్నది. ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా తరగతి గదులకు రైలుబండిలా పెయింటింగ్ వేయించారు. జిల్లాలోనే మారుమూల ప్రాంతమైన కంగ్టి మండలంలో అక్షరాస్యత శాతం అంతంత మాత్రమే. ఇందుకు తోడు ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలువడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతున్నది. ఇది గమనించిన పాఠశాల అప్పటి హెచ్ఎం సంతోష్రెడ్డి వినూత్నంగా ఆలోచించి విద్యార్థులు ఆకర్షించేలా రైలుబండి పెయింటింగ్ వేయించారు. దీంతో ఈపాఠశాల ప్రస్తుతం ఈప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఐదు తరగతులున్న ఈపాఠశాలలో నాల్గో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధన కూడా ఉన్నది. అయినప్పటికీ గతంలో కేవలం 91 మంది విద్యార్థులు మాత్రమే అభ్యసించేవారు. ఇప్పుడు ఈ ‘రైలుబడి’ని చూసి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సైతం ఈ పాఠశాలలో చదవుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 255 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఒకరు పాఠశాలకు రాగా, మొత్తం ఆరుగురు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. ప్రభుత్వం సైతం వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో 5వ తరగతి వరకు విద్యార్థులు గణనీయంగా పెరిగే అవకాశమున్నది.
చైల్డ్ఫ్రెండ్లీ ఎక్స్ప్రెస్గా నామకరణం..
రైలుబండిలా పెయింటింగ్ వేసిన తరువాత ఈ బడికి చైల్డ్ఫ్రెండ్లీ ఎక్స్ప్రెస్గా పాఠశాల హెచ్ఎం నామకరణం చేశారు. పాఠశాల 1972లో ప్రారంభం కావడంతో రైలునంబర్ను 1972గా వేయించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన చందు అనే ఆర్టిస్ట్ను పిలిపించి ఐదు తరగతులు ఉన్న పాఠశాలకు ఈ పెయింటింగ్ను వేయించినట్లు ప్రస్తుత హెచ్ఎం వెంకటేశం తెలిపారు. దీనికి గానూ మొత్తం రూ.30 వేలు ఖర్చు కాగా, తన సొంత నిధులతో ఈ పనులు చేయించినట్లు పేర్కొన్నారు. రైలుబండి ఇంజిన్ ఆకారంలో బ్లాక్బోర్డును ఏర్పాటు చేశారు. ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్న రైలు ఆకారాన్ని పోలిఉన్న పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 165మంది ప్రైవేట్ విద్యార్థులు తమ పాఠశాలలో అడ్మిషన్ అయ్యారని హెచ్ఎం వెల్లడించారు.