గుమ్మడిదల, మార్చి 26: హోలీ పండుగ పూట రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకున్నది. రంగుల పండుగను పురస్కరించుకుని చెరువు వద్ద ఫొటోషూట్ చేయడానికి వచ్చిన ఇద్దరు యువకులు నీట మునిగి మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల సీఐ సుధీర్కుమార్, ఎస్సై మహేశ్వర్రెడ్డి వివరాల ప్రకారం.. కుత్బులాపూర్ నియోజకవర్గంలోని సూరారం ప్రాంతానికి చెందిన ఎరుకల శ్రవణ్కుమార్(17), కొమురోళ్ల శంకర్(22) స్నేహితులతో కలిసి సోమవారం హోలీ పండుగ సందర్భంగా సాయంత్రం బొంతపల్లి వీరన్నచెరువు వద్దకు ఈత కొట్టడానికి వచ్చారు. వీరు స్నేహితులతో మొబైల్తో ఫొటో షూట్ చేశారు. శ్రవణ్కుమార్, శంకర్ చెరువులో దిగి ఈత కొట్టడానికి వెళ్లగా చెరువులో నీరు ఎక్కువగా ఉండడంతో నీటమునిగాడు. దీంతో తోడు వచ్చిన స్నేహితుడు ఆంజనేయులు ఈ విషయాన్ని వెంటనే శ్రవణ్ తండ్రి మనుపాటి శ్రీనివాస్కు, శంకర్ తండ్రి వెంకటేశ్కు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రయినా వారి జాడ దొరకలేదు. దీంతో మంగళవారం ఉదయం నుంచి 11.30 వరకు గజ ఈతగాళ్లతో చెరువును గాలించి శ్రవణ్, శంకర్ మృతదేహాలను వెలికితీశారు. చేతికి వచ్చిన బిడ్డలు తనువు చాలించడంతో బాధిత కుటుంబాల్లో రోదనలకు మిన్నంటాయి. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను నర్సాపూర్ సర్కారు దవాఖానకు తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.