నేడు బక్రీద్ పండుగ(ఈద్- ఉల్- ఆదా)ను ముస్లింలు నిర్వహించుకుంటారు. త్యాగనిరతికి, అల్లాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారు. బక్రీద్ను పురస్కరించుకుని ఈద్గాలను ముస్తాబు చేశారు. ముస్లింలు ఈద్గాలకు వెళ్లి ఈద్ నమాజ్ చదువుతారు. మతపెద్దలు, మౌల్వీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. నమాజు అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతారు. అనంతరం ఖబ్రస్థాన్లలోని తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తారు. పండుగ సందర్భంగా ఇండ్లలో విందులు నిర్వహిస్తారు. బక్రీద్ సందర్భంగా తాహత్తు కల్గిన వారు మేకపొట్టేళ్లను ఖుర్బానీ ఇస్తారు. ఖుర్బానీలను పురస్కరించుకుని జిల్లాలో పెద్దఎత్తున మేకపొట్టేళ్లను వ్యాపారులు అమ్మకానికి పెట్టారు. బక్రీద్ ఖుర్బానీ కోసం ముస్లింలు మేకపొట్టేళ్లను కొనుగోలు చేస్తున్నారు.
పటాన్చెరు/మెదక్ మున్సిపాలిటీ, జూన్ 28 : భారతదేశం సర్వమతాల సమ్మేళనం. ప్రతి మతానికి ఆచారాలు, పద్ధ్దతులు, వ్యవహార శైలులు ఉంటాయి. ప్రజలు ఆయా సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పాటిస్తుంటారు. ముస్లింలు నిర్వహించుకునే పండుగల్లో ముఖ్యమైనవి రెండు. ఒకటి ఈదుల్ ఫితర్(రంజాన్), రెండోది ఈద్-ఉల్ ఆదా(బక్రీద్).
రంజాన్ పండుగ అనంతరం రెండు నెలలకు బక్రీద్ వస్తుంది. ఈ పండుగ మనిషికి త్యాగనిరతిని తెలియజేస్తుంది. అందుకే ఈ పండుగను త్యాగాల పండుగ అంటారు. ఈ పండుగ ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం 12వ నెల ‘జిల్హాజ్జ’లోని పదో తేదీన జరుపుకొంటారు. బక్రీద్ అంటే ‘బకర్ ఈద్’, ఈద్ అంటే పండుగ, బకర్ అంటే జంతువు, జంతువును బలిచ్చే పండుగ కనుక ఈ పండుగను ‘ఈదుల్-ఖుర్భానీ’ అంటారు. ఖుర్భానీ అంటే దేవుని పేరుతో పేద వారికి జంతువు మాంసం దానం ఇవ్వడం.
అల్లాహ్ ముఖ్య ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం ఇస్లాం విశ్వాసాలను ప్రపంచమంతా ప్రచారం చేస్తూ కాలినడకన తిరుగుతూ ఉండేవాడు. ఇబ్రహీంకు పెళ్లి అయిన చాలా ఏండ్ల వరకు సంతానం కలగలేదు. సంతానాన్ని ఇవ్వాలని ఒకరోజు అల్లాను కోరుతాడు. అల్లా కరుణతో ఓ కుమారుడు జన్మిస్తాడు. అతనికి ఇస్మాయిల్ అని నామకరణం చేస్తాడు. చాలా ఏండ్ల తర్వాత జన్మించడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. తమపై ఉన్న విశ్వాసాన్ని పరీక్షించదల్చుకున్న అల్లా(దైవం).. వరుసగా మూడు రోజులు ఇబ్రహీం కలలోకి వస్తాడు. తన ముద్దుల కుమారుడు ఇస్మాయిల్ను బలివ్వాలని సందేశాన్ని కలలో వినిపిస్తాడు అల్లా. ఇబ్రహీం సంకల్పాన్ని అతని భార్య, కుమారునికి తెలియజేయడంతో అల్లా కోసం తన తండ్రి తీసుకున్న నిర్ణయానికి దైవ భక్తుడైన ఇస్మాయిల్ సంతోషంగా ప్రాణత్యాగానికి సిద్ధ్దమవుతాడు. దీంతో అల్లా దైవవాణి ద్వారా ఇబ్రహీం ఇది నిన్ను పరీక్షించడానికి మాత్రమే.. నా పరీక్షలో నీవు గెలిచావు. కుమారుడి బదులు ఓ జీవాన్ని (గొర్రె)బలివ్వాలని కోరతాడు. ఆ రోజు నుంచే ఆనవాయితీగా బక్రీద్ పండుగ రోజు ఖుర్భానీగా జంతువును బలి ఇస్తున్నారు.
బక్రీద్కు ఒకరోజు ముందు చనిపోయిన కుటుంబ సభ్యుల సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలు, వస్తువులు ఉంచుతారు. వారు స్వర్గం నుంచి వచ్చి వాటిని భుజిస్తారని, స్వీకరించి తమను ఆశీర్వదిస్తారని నమ్ముతారు. నెమరు వేసే జంతువులను మాత్రమే బలి ఇచ్చి మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరో భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకో భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింల త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ జరుపుకొంటారు. వర్షాకాలంలో బక్రీద్ పండుగ రావడంతో ఈద్గాల్లో నమాజ్కు వర్షం కారణంతో అంతరాయం కల్గితే ఈద్గా కమిటీలు, మత పెద్దలు ప్రత్యామ్నాయంగా స్థానిక మసీదుల్లో నమాజు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దిపేట అర్బన్, జూన్ 28 : రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారని తెలిపారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తిశ్రద్ధ్దలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు. అల్లా దయతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.