మెదక్/మెదక్ రూరల్, అక్టోబర్ 22 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయ దశమి. సోమవారం జిల్లావ్యాప్తంగా దసరా వేడుకలు నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఆలయాలతో పాటు జమ్మి చెట్టు వద్ద శమీ పూజలు నిర్వహించనున్నారు. పరిశ్రమలు, దుకాణాలతో పాటు వాహనదారులు ఆయుధ పూజలు చేయనున్నారు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు కుటుంబసభ్యులతో తిరిగి రావడంతో గ్రామాలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. ఆదివారం దుస్తులు, గృహోపకరణాలు, పండుగ సామగ్రి, పటాకుల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి.
చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకొంటారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మొహ, లోభ, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకారం అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే దూరమవుతాయనేది నమ్మకం. విజయదశమి రోజున రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను పెట్టిన రోజు. రావణవధ, జమ్మి చెట్టుకు పూజ చేయడం ఆచారం, జగన్మాత అయిన దుర్గాదేవి, మహిషాసురడనే రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకొన్నారు.
మహిషాసురిడిని వధించిన అమ్మవారు
బ్రహ్మదేవుడి వరాలతో గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో భీకరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా, మహిషుడిపై వారిలో రగిలిన క్రోదాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బహువులుగా, బ్రహ్మతేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పదునేనమిది చేతులను కలిగి ఉంది. దుర్గాదేవికి శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశం, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చా రు. ఇలా సర్వదేవత ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలబడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుడి తరఫున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బి డాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసునితో తలపడి అమ్మవారు విజయం సాధించింది.
ఆయుధ పూజ
దసరా ఉత్సవాల్లో అతి ముఖ్యమైనది ఆయుధపూజ, విజయదశమికి ముందురోజు వచ్చే మహార్నవమి రోజు, కొందరు అదే రోజున ఈ పూజలు చేస్తారు. ఆయుధ పూజ అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని దుర్గాదేవి మహిషాసురడనే రాక్షసుడిని సంహరించిన వేడుకగా జరుపుకొంటారు. ఆయుధపూజను అస్త్రపూజ అంటారు. ప్రజలు వారు ఉపయోగించే ఉపకరణాలు, ఆయుధాలు, యంత్రాలు మొదలైన వాటికి సైతం పూజలు చేస్తారు.
శుభాలనిచ్చే పాలపిట్ట
దసరా పండుగలో పాలపిట్టకు ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది, విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని, పాపాలు నాశనం అవుతాయంటారు. సర్వత్రా విజయాలు సైతం లభిస్తాయని, విశ్వాసం, పాండవులు, అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనిపించింది. ఆ రోజు నుంచి వారు ఏది చేసినా విజయం సిద్ధించిందని పెద్దలు చెబుతుంటారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పాలపిట్టను శుభసూచకమైన పక్షిగా పరిగణిస్తారు. ప్రత్యేకించి తెలంగాణలో భక్తిప్రవత్తులతో చూస్తారు. తెలంగాణ పాటు కర్ణాటక, బీహార్, ఒడిశా రాష్ట్ర పక్షి పాలపిట్టే అంటే ఈ పక్షికి ఉన్న ప్రాధాన్యం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.
జమ్మి చెట్టు
జమ్మిచెట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లడానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచారిని తమకు విజయం కలుగాలని ఆ చెట్టును పూజించినట్లు తెలిసిందే. జమ్మి చెట్టుకు పూజలు చేసే సంప్రదాయం దేశమంతటా ఉంది. ఈ చెట్టును అగ్ని స్వరూపంగా భావిస్తారు. యజ్ఞాలు కోసం నిప్పు రాజేసేందుకు శమీ దారువునే ఉపయోగించేవారు. అందుకే దీన్ని అగ్నిగర్భ అంటారు. ఔషధ లక్షణాలు సమృద్ధిగా ఉన్న ఈ చెట్టు తెలంగాణ వృక్షం. సకల కార్యసిద్ధి కోసం, సర్వత్రా విజయ, క్షేమాల కోసం జమ్మి చెట్టును పూజించాలని పెద్దలు చెబుతారు.