ఏటా మూడురోజులు జాతర
అమావాస్య ,పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు
పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు
మెదక్ రూరల్, ఫిబ్రవరి 5: : మండలంలోని మంబోజిపల్లి గ్రామ శివారులోని కోర మీసాల కొయ్యగుట్ట శ్రీమల్లిఖార్జునస్వామి కల్యాణం ఈ నెల 6 నుంచి 8 వతేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వంశపారంపర్య అర్చకులు తెలిపారు. ఆదివారం వేకువజాము నుంచి ప్రత్యేక పూజలతో రుద్రాభిషేకాలు, సహస్రబిల్వార్చన , 12గంటలకు శ్రీమల్లిఖార్జునస్వామి కల్యాణం, అనంతరం అన్నదానం ,సాయంత్రం ఐదు గంటలకు ఎడ్లబండ్లు తిరుగుట, రాత్రి మల్లన్న స్వామి ఒగ్గుకథ, సోమవారం ఉదయం పంచామృతాలతో రుద్రాభిషేకం, రుద్రహోమం, సాయంత్రం అగ్నిగుండం, స్వామి వారికి బోనాలు, ఏడు గంటలకు రుద్రాభిషేకం, బిల్వార్చన, ఒగ్గుకథలు, మంగళవారం ఉదయం రుద్రాభిషేకం, శ్రీ రేణుకా ఎల్లమ్మకు బోనాలు ఉంటాయి.
దేవాలయ చరిత్ర
మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామ శివారులోని కొయ్యగుట్ట పై బండరాళ్ల మధ్య గృహలో సుమారు 216 ఏండ్ల్ల క్రితం మల్లిఖార్జున స్వామి కొలువుదీరాడు. మెదక్ పట్టణానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తికి మల్లన్నస్వామి పూనకంతో గుట్ట పైకి ఎక్కి చూస్తే సహజసిద్ధంగా వెలిసిన నర్సింహస్వామి, మల్లిఖార్జునస్వామి, నంది విగ్రహాలను చూపించాడట. గుట్టపై కొన్నేండ్ల పాటు పూజలు చేసిన ఆ పూజారి మల్లయ్య గుట్టకింద చిన్నపాటి మల్లిఖార్జునస్వామి ఆలయాన్ని నిర్మించి ఆ తర్వాత కొద్ది రోజులకు పుట్టమన్నుతో తయారు చేసిన మల్లిఖార్జునస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నేటికీ గుట్ట పై ఉన్న గుహలో పగటి పూట సైతం చిమ్మచీకటి ఉంటుంది.అందులోకి వెలుతురులో వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగా పూజలు చేయాలి. దీంతో వారి వంశీయులు వంశపారంపర్యంగా అక్కడ ఎన్నో దశాబ్దాలుగా ప్రత్యేకపూజలు చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఏటా మాఘమాసం తర్వాత వచ్చే ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. అందులో భాగంగా మల్లిఖార్జున స్వామి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జాతర సమయంలో బోనాల ఊరేగింపు,అగ్నిగుండాలు, బండ్ల ఊరేగింపు తదితర కార్యక్రమాలు ఉంటాయి.
ఇలా వెళ్లొచ్చు
మెదక్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని మంబోజిపల్లి శివారులో ఉన్న మల్లిఖార్జున స్వామి ఆలయానికి బస్సులు, ఆటోలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు నర్సాపూర్ మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు .