పటాన్చెరు, ఫిబ్రవరి 8: ప్రతిభకు హద్దులు లేవని అపోలో దవాఖానల సామాజిక సేవ (సీఎస్సార్) ఉపాధ్యక్షురాలు కామినేని(కొణిదెల) ఉపాసన అన్నారు. గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్లో శివాజీ ఆడిటోరియంలో మూడు రోజుల సాంకేతిక, సాంస్కృతిక (టెక్నో, కల్చరల్ ఫెస్ట్) పండుగను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చన్నారు. లింగభేదం లేకుండా నేటితరం అన్నిరంగాల్లో రాణించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో అత్యుత్తమమైన ప్రదర్శన ఇచ్చేందుకు తమను తాము ప్రతి ఒక్కరూ సన్నద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వంశీకృష్ణ ఈ సందర్భంగా తన స్వీయ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
అందుబాటులో వనరులు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని కెరీర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. అడ్డంకులను అధిగమిస్తేనే ఉన్నత స్థానాలకు చేరుకుంటామని తెలిపారు. ఎలక్ట్రికల్, మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్న తాను సౌరశక్తి రంగంలో ఉన్న అభిరుచితో సౌర పైకప్పును రూపొందించి పేటెంట్ పొందానని చెప్పారు. ఎలక్ట్రికల్ వాహనాల రంగంలో ఉన్న ఆసక్తి మేరకు ఓ ఎలక్ట్రికల్ బైక్ను రూపొందించానని గుర్తుచేశారు. దేశం నుంచి ఆరు పేటెంట్లు పొందినట్లు కామినేని (కొణిదెల) ఉపాసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డరెక్టర్ వీఆర్ శాస్త్రి, ప్రమాణ 2024 అధ్యాపక సలహాదారు ప్రొఫెసర్ పి.త్రినాథరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.