గజ్వేల్, జనవరి 18: ప్రభుత్వం యాసంగిలో సాగుకు నీళ్లు ఇస్తదో లేదో అనే అప నమ్మకం రైతుల్లో ఏర్పడిందని, దీంతో రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారని, వెంటనే రైతుల్లో విశ్వాసం, నమ్మకం కల్పించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం గజ్వేల్లోని శోభ గార్డెన్లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అధ్యక్షత నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ముఖ్య అథితిగా విచ్చేసి, ఆయన మాట్లాడారు. పోయిన యాసంగిలో పడిన నాట్లు ఇప్పటికీ పడలేదని, సాగు విస్తీర్ణం తగ్గుతున్నదని, రైతులకు సాగు నీరు, 24 గంటల కరెంట్, రైతుబంధు నగదు ఎప్పుడిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగు విస్తీర్ణం వివరాలను వెంటనే ప్రజల ముందు పెట్టాలన్నారు. ఏడాదిలోనే ప్రజలు మనల్ని అర్థం చేసుకునే రోజులు వస్తాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమై విజయాలు సాధించామని, రైతులకు సాగునీళ్లు అందించి మూడు పంటలు పండించుకునే అవకాశాల్ని కల్పించామన్నారు. కేసీఆర్ ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించే నాయకుడన్నారు. సాగునీళ్లను కింద నుంచి పైకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించారన్నారు.
రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, మత చిచ్చు పెట్టినా గొప్ప విజయాన్ని అందించిన గజ్వేల్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. చాలా కుట్రలు చేసి 154 మంది అభ్యర్థులు నామినేషన్లు వేస్తే, అందులోంచి 47 మంది పోటీలో ఉన్నారని, వీరికోసం నాలుగు ఈవీఎంలు కేటాయించడంతో 18,750 ఓట్లు చిత్తిపోయాయన్నారు. కారును పోలిన రోడ్డు రోలర్తో ప్రతిసారి నష్టం జరుగుతున్నదన్నారు. ఇన్ని కుట్రలు జరిగినా 45 వేల మెజార్టీతో కేసీఆర్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్లో గెలిచిన పార్టీదే రాష్ట్రంలో ఎప్పుడూ అధికారం వచ్చేదని, కానీ ఈసారి తలకిందులైందన్నారు. మూడోసారి కేసీఆర్ను గెలిపించుకున్న ఘనత గజ్వేల్ ప్రజలకే దక్కిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కేసీఆర్ తాగు, సాగునీరు అందించి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డారన్నారు. బీఆర్ఎస్ హయాంలో హత్యా రాజకీయాలు, పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడం తగ్గాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ కేసులు పెట్టి చరిత్రను తిరగరాస్తున్నదన్నారు. ప్రజల బాధలు పట్టించుకోకుండా నెల రోజుల్లోనే కుట్రలు, కుతంత్రాలతో బెదిరింపులకు పాల్పడుతూ క్రిమినల్ కేసులు పెట్టిస్తున్నారన్నారు. కుట్రలు, కుతంత్రాలు వదిలి ప్రజలకు తాగు, సాగునీరు, రోడ్ల అభివృద్ధి చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే పీఏసీఎస్, మున్సిపల్ చైర్మన్లను దింపడమే తరువాయిగా ముందుకెళ్లుతున్నరన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఎస్జీఎఫ్, పంచాయతీ, ఆర్అండ్బీ పనులు ఆపేశారని, ఈ నిధులను వెనక్కి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. చేతనైతే ఎక్కువ నిధులు తెచ్చి పనులు చేపట్టాలన్నారు.
త్వరలోనే మీ అందరి ముందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారని హరీశ్రావు అన్నారు. 15 రోజుల్లో క్యాంపు కార్యాలయానికి వస్తారని, వీలుకాని సమయంలో వ్యవసాయక్షేత్రానికి తీసుకెళ్లి అందరితో కలిపిస్తానన్నారు. లోకల్బాడీ ఎన్నికల్లో కార్యకర్తలందరికీ అండగా ఉంటానన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీముందుకొస్తానన్నారు. 24 గంటలు ఎప్పుడు నా ఇంటి తలుపులు మీ కోసం తెరిచి ఉంటాయని, కార్యకర్తలు అధైర్యపడొద్దని, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. పోరాటాలు తమకేమీ కొత్తవి కాదని, తాను హైదరాబాద్లో వెళ్లని పోలీస్స్టేషన్ లేదని, మెదక్ జైల్లో నాలుగు రోజులు ఉన్నానని అన్నారు. వర్గల్ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి, పరిశ్రమల్లో ఉద్యోగాలు తీసేయించారని హరీశ్రావు దృష్టికి యువకులు తీసుకొచ్చారు. వచ్చే అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింట్లో మనవాళ్లే ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణాశర్మ, డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్, మున్సిపల్ మాజీ చైర్మన్లు రాజమౌళి, రవీందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, నాయకులు గాలి అనిల్కుమార్, జుబెర్పాషా, శేఖర్గౌడ్, ప్రభాకర్రెడ్డి, మర్కూక్ కరుణాకర్రెడ్డి, నవాజ్మీరా, ఉడేం కృష్ణారెడ్డి, సుధాకర్రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రెండు గ్యారెంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ పెద్దల ఊకదంపుడు ఉపన్యాసాలే తప్పా ఎక్కడా అమలుకావడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. స్వయంగా తానే సచివాలయంలో సంబంధిత శాఖాధికారులను కలిస్తే ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొలేదన్నారు. తన వద్దే వంద ఫైళ్లు సిద్ధంగా ఉన్నాయని, అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదన్నారు. హరీశ్రావు నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలోని పదింట్లో ఏడు స్థానాలు గెలుచుకున్నామని, హైకమాండ్ సూచనల మేరకు రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన అన్నారు.
కేసీఆర్ చేసిన అభివృద్ధిలో ఒక్కశాతం పనులు చేపట్టినా వారికి సన్మానం చేస్తామన్నారు. గజ్వేల్లో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీశ్రావు కష్టపడిన విధంగా అన్ని జిల్లాలో నాయకులు కష్టపడి పనిచేస్తే 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాలు వచ్చేవన్నారు. ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా కేసీఆర్ అన్ని విధాలుగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారన్నారు. గ్రామాల్లో తమ పార్టీ కార్యకర్తలపై దుర్మార్గంగా నాయకులను ఉసిగొల్పుతున్నారని, ప్రతీ కార్యకర్తకు అండగా నిలబడుతామన్నారు.