అందోల్, సెప్టెంబర్ 26: క్రీడా రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. అందులో భాగంగా అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. మంగళవారం జోగిపేట ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లాస్థాయి ఖోఖో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగిపేట పట్టణంలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించేందుకు సైతం అనువైన స్టేడియం అందుబాటులో ఉన్నదని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జోగిపేట పరిసర ప్రాంత క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో స్థానిక ఎన్టీఆర్ స్టేడియాన్ని రూ.కోట్లు వెచ్చించి ఆధునీకరించామన్నారు. కొంత స్థలం ఆక్రమణకు గురవుతున్నట్లు తమ దృష్టికి రావడంతో చుట్టూ ప్రహరీ సైతం నిర్మించామన్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే వాటిని సైతం పరిష్కరిస్తామని చెప్పారు. అందోల్ నియోజకవర్గం కీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని, అందుకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతనం ఎమ్మెల్యే ఖోఖో ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
క్రీడా పోటీల సందర్భంగా పలువురు విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే అందోల్-జోగిపేట పరిధిలోని పలు వార్డుల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు. హౌసింగ్బోర్డు కాలనీ వద్ద అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, కమిషనర్ తిరుపతి, ఎంఈవో కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.