సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు
నల్లజెండాలతో బైక్ర్యాలీలు, ప్రధాని శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం
నిరసనల్లో పెద్ద ఎత్తున్న పాల్గొన్న శ్రేణులు
తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్
కాంగ్రెస్, వామపక్షాలు, పలు సంఘాల ఆధ్వర్యంలోనూ ఆందోళనలు
సిద్దిపేట, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాస్తారోకోలు.. బైక్ ర్యాలీలు.. శవయాత్రలు.. దిష్టిబొమ్మల దహనాలు.. జై తెలంగాణ నినాదాలతో బుధవారం మెతుకుసీమ దద్దరిల్లింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు మిన్నంటాయి. ప్రధాని తీరు సరికాదని, ఆయన వ్యాఖ్యలు తెలంగాణపై వ్యతిరేకతను తెలియజేస్తున్నాయని, పోరాడి సాధించుకున్న తెలంగాణను, ఉద్యమకారులు, అమరులను అవమానించేలా ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని మండల, పట్టణ, జిల్లాకేంద్రాల్లో నిరసనలు చేపట్టారు. నల్లజెండాలతో బైక్ర్యాలీలు నిర్వహించారు. ప్రధాని మోదీ శవయాత్రలు నిర్వహించి దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాస్తారోకోలు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ప్రధాని ఇలా మాట్లాడుతున్నారని, వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ ఆందోళనలు చేపట్టారు.
తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మం డల కేంద్రాలతో పాటు జిల్లా, పట్టణ కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు నల్లజెండాలతో భారీగా బైక్ ర్యాలీలు నిర్వహించి మోదీ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపై రాస్తారోకోలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన నిరసనలో మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఛైర్మన్ మంజులారాజనర్సు నేతృత్వంలో, గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఉమ్మడి జిల్లా శాసనమండలి సభ్యుడు వంటేరి యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో టీఆర్ఎస్ శ్రేణులు, అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మనోహరాబాద్ మండల కేంద్రంలో జడ్పీ అధ్యక్షురాలు హేమలతాశేఖర్ గౌడ్, నర్సాపూర్లో ము న్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రం లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అందోల్లో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు, నారాయణ్ఖేడ్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, పటాన్చెరువులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి నేతృత్వంలో నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణపై మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. తెలంగాణపై ప్రధానికి, బీజేపీ నాయకులకు ఎంత ప్రేమ ఉందో రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అని నేతలన్నా రు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం జీర్ణించుకొని ప్రధాని ఇలా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవడంపై బీజేపీ నాయకులు జీర్ణించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.