పాపన్నపేట, జూన్ 25: ఆషాఢమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గా భవానీమాతను లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో విందు భోజనాలతో బంధుబలగంతో సందడి చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది మధుసూదన్రెడ్డి, రవివీర్కుమార్, సూర్య శ్రీనివాస ప్రతాప్రెడ్డి, వరుణాచారి, రాజు, యాదగిరి, శ్రీకాంత్ ఏర్పాట్లు చేశారు. వేద పండితులు పార్థివశర్మ, శంకరశర్మ, రాజశేఖర్శర్మ, రాముశర్మ, మురళీధర్ ప్రత్యేక పూజలు చేశారు.
దుర్గామాతను దర్శించుకున్న కేంద్రమంత్రి
ఏడుపాయల వనదుర్గా భవానీమాతను కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో సారాశ్రీనివాస్, అర్చక బృందం, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పాపన్నపేట మండల నాయకులు వడ్ల సంతోష్చారి, బైండ్ల సత్యనారాయణ, మెదక్ ఆర్డీవో సాయిరాం, డీఎస్పీ సైదులు, పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ ఉన్నారు.