మెదక్ మున్సిపాలిటీ, జూలై 10 : ఉపాధ్యాయ నియామకాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ నెల 7న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో టెట్ నిర్వహించాలని నిర్ణయిస్తూ ఆమో దం తెలిపింది. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అర్హులైన అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన వారితోపాటు అర్హత సాధించని వారు కొత్తగా డీఎడ్, బీఈడీ పూర్తి చేసిన వారు టెట్ నిర్వహణపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పోలీసు ఉద్యోగాలతో పాటు టీపీపీఎస్సీ ద్వారా వివిధ పోస్టుల నియామకాల పరీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభు త్వం టెట్ పరీక్ష నిర్వహించనుండడంతో నిరుద్యోగ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర అవతరణ తర్వాత 2016లో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం టెట్ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2017, 2022లో నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయంతో ప్రభుత్వం త్వరలో నిర్వహించబోతుం ది. జిల్లాలో ఏటా సుమారు వెయ్యిమంది వరకు అభ్యర్థులు డీఎడ్, బీఈడీ పూర్తి చేస్తున్నారు. గత సంవత్సరం నిర్వహించిన టెట్ పరీక్షకు మొత్తం 14,762 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో మొదటి పేపర్కు 8,605 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం జరిగిన రెండో పేపర్కు 6,157 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో 664 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. డీఈడీ, బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులకు టీఆర్టీ నిర్వహిస్తే పోటీ తీవ్రతరంగా ఉండనున్నది.
ప్రభుత్వం త్వరగా టెట్ నిర్వహించాలి
ప్రభుత్వం టెట్ త్వరగా నిర్వహించాలి. త్వరలో శాసనసభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందే టెట్ నిర్వహించి అర్హత సాధించిన వారికి టీఆర్టీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి.
-మల్లారెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
ప్రభుత్వం టెట్ నిర్వహించాలని తీసుకున్న నిర్ణ యం హర్షణీయం. ప్రభుత్వ ఇటీవల పోలీసు ఉద్యోగాల పరీక్షలు నిర్వహించింది. ఇటీవల టీపీపీఎస్సీ ద్వారా గ్రూప్-1,4 ఉద్యోగ పోటీ పరీక్షలు నిర్వహించింది. ఆగస్టులో గ్రూప్-2 పరీక్ష ఉంది. టెట్ పరీక్షల సైతం నిర్వహించి రాబోయే ఎన్నికలకు ముందే టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి.
-నరేశ్, టెట్ విద్యార్థి