Gruha Lakshmi | సిద్దిపేట, జనవరి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు గృహలక్ష్మి పథకం కింద ఇంటి స్థలం ఉండి నిర్మాణం చేసుకోవడానికి ముందుకు వచ్చిన అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేసింది. దీంతో వారంతా భూమిపూజ చేసుకొని ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టారు. తీరా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద మంజూరైన 16,800 ఇండ్లను రద్దు చేయడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తే… ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లను రద్దు చేసిందంటూ వారు మండిపడుతున్నారు.పేదలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గృహలక్ష్మి పథకం కింద మంజూరైన వారికి యథావిధిగా ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సైతం గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం సైతం చేసి ప్రభుత్వానికి పంపారు.
సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద ఇంటి స్థలం ఉన్నవారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి 51,685 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తులను అప్పటి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టింది. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేయగా వాటిలో 33,471 మంది అర్హులు అని తేలింది. దీంతో అర్హులైన వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి ఆ మొత్తం చెల్లించాలని నిర్ణయించింది. అప్పటి ప్రభుత్వం జిల్లాకు తొలి విడతగా 16,800 ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో సిద్దిపేట నియోజకవర్గానికి 3,000, గజ్వేల్ నియోజకవర్గానికి 7,950, దుబ్బాక నియోజకవర్గానికి 2,400, హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాలకు 1,500, మానకొండూరు నియోజకవర్గానికి 500 ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో లబ్ధిదారులకు మొదటగా దుబ్బాక నియోజకవర్గంలో 869 మంది, గజ్వేల్ నియోజకవర్గంలో 7,790 మంది, హుస్నాబాద్ నియోజకవర్గంలో 294మంది, మానకొండూరు నియోజకవర్గంలో 443 మంది, సిద్దిపేట నియోజకవర్గంలో 2,363 మందికి ఎన్నికల ముందు గత అక్టోబర్లో మంజూరు పత్రాలు అందించారు. దీంతో వారంతా ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు.
ఇప్పుడు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేయడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. నిరుపేదల గూడు కట్టుకోవడానికి సహకరించాల్సిన ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతుందని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వాలు మారగానే మంజూరైన పథకాలను రద్దు చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఇచ్చేవి ఉంటే అవి ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి గానీ ఇదివరకే మంజూరైన వాటిని రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాము పూర్తిస్థాయిలో ఇంటి నిర్మాణం చేస్తేనే తమకు బిల్లులు ఇవ్వండి అంతే గానీ ఉన్నఫలంగా మంజూరైన ఇండ్లను రద్దు చేయడం సరికాదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీల పథకంలో వీటిని చేర్చి అమలు చేయలని డిమాండ్ చేస్తున్నారు. పేదలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకోవడం సరికాదని వారు అంటున్నారు. తామంతా ఇంటి నిర్మాణాలు ప్రారంభిం చాం.. ఇవాళ ఉన్నఫలంగా మంజూరైన ఇండ్లను రద్దు చేయడంతో తామంతా రోడ్డున పడ్డామని లబ్ధిదారులు వాపోతున్నారు.