సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 18: సంగారెడ్డి జిల్లాలో సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్కు ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుతూ వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో అర్హులకు లబ్ధి చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. జిల్లాలో ఆసరా పింఛన్లు, తెలంగాణకు హరితహారం, బీసీలు, మైనార్టీలకు ఆర్థిక సాయం, నోటరీ భూముల క్రమబద్ధీకరణ, రెండో విడత గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై కలెక్టర్తో ఆరా తీశారు. డెత్ కేసుల్లో ఆసరా స్పౌజ్ పెన్షన్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే అర్హుల జాబితాను ఆమోదం కోసం పంపించాలన్నారు.
నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా నియామక ఉత్తర్వులు అందించడంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ ముగింపు వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయిందని, ఆ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో గుంతలు సిద్ధం చేయాలన్నారు. అవసరమైన మొక్కలు అందుబాటులో ఉంచాలన్నారు. వచ్చే వారం నాటికి జిల్లాలో 90 శాతానికి పైగా మొక్కలు నాటించాలన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ విజయవంతం చేయాలన్నారు.
1701 ఆసరా స్పౌజ్ పెన్షన్ దరఖాస్తులు
కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో 1701 ఆసరా స్పౌజ్ పెన్షన్ దరఖాస్తులు అప్రూవల్ చేసి పంపించామని సీఎస్కు తెలిపారు. జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు 522 యూనిట్లు లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 6.20 లక్షల లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు 1080 ప్రాంతాలు గుర్తించామని, ఇప్పటివరకు 3.28 లక్షల గుంతలు తీయడం పూర్తయిందన్నారు. మూడు నాలుగు రోజుల్లోగా మొత్తం గుంతలు తీసి ఈ నెల 26న అందరి భాగస్వామ్యంతో మాస్ ప్లాంటేషన్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మండలానికి ఒకటి చొప్పున సంపద వనాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రెండో విడత బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీకి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.