శివసత్తుల పూనకాలు.. బోనాలు.. బండారి మెరువంగా కొమురవెల్లి క్షేత్రం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతుండగా.. 4వ ఆదివారానికి 35వేల మంది భక్తులు వచ్చారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు
చేర్యాల, ఫిబ్రవరి 12: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలు 4వ ఆదివారం సందర్భంగా 35వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ తెలిపారు. కొమురవెల్లి మల్లన్న కోటిదండాలు అనే నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, బోనాలు అలరించాయి.
శనివారం ఉదయం నుంచే మల్లన్న క్షేత్రానికి భక్తులు చేరుకున్నారు. ఆలయ నిర్వహణలో ఉన్న గదులతో పాటు ప్రైవేటుగా ఉన్న గదుల్లో బస చేశారు.ఆదివారం వేకువజామునే నిద్రలేచి కోనేటిలో పవిత్ర స్నానం ఆచరించారు. గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చనలు, ప్రత్యేక పూజలు, కేశఖండన, నజరు, మహామండప, చిలుక పట్నం, బోనం, టెంకాయలు, హుండీల్లో కానుకలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. మొక్కులు తీర్చాలని గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, సంతానం కలగాలని మరికొందరు ఒల్లుబండ పూజలు, రాతిగీరల వద్ద మొక్కులు, కోడెను కట్టివేసి స్వామి వారిని వేడుకున్నారు. కొమురవెల్లి దర్శనం తర్వాత కొండపైన ఉన్న ఎల్లమ్మకు పూజలు చేశారు. అక్కడి నుంచి కొండపోచమ్మ ఆలయానికి భక్తులు వెళ్లారు.
ఉత్సవాలకు హాజరైన భక్తులకు ఆలయం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. భక్తులు తీర్థ ప్రసాద విక్రయాలు కొనసాగాయి. ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఆలయ డైరెక్టర్లు నర్రా రఘువీరారెడ్డి, కొంగరి గిరిధర్, కందుకూరి సిద్ధిలింగం,పచ్చిమడ్ల సిద్ధిరాములు, కాసర్ల కనకరాజు, గడ్డం మహేశ్యాదవ్, చెట్కూరి తిరుపతి, నామిరెడ్డి సౌజన్యరవీందర్రెడ్డి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెట్లు నీల శేఖర్, శ్రీనివాస్శర్మ, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు సేవలు అందించారు.
అడిషనల్ డీసీపీ మహేందర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ నేతృత్వంలో జిల్లాలోని వివిధ ప్రాం తాలకు చెందిన సీఐలతో పాటు కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు మండలాల ఎస్సైలు చంద్రమోహన్,భాస్కర్రెడ్డి, నారాయణ,సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.