సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 16 : డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను వేగవంతం చేయాలని, పూర్తైన ఇండ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో హౌసింగ్ నోడల్ అధికారి, సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల పనుల పురోగతి, మౌలిక సౌకర్యాల కల్పన, సైట్ల వారీగా పూర్తైన ఇండ్లు, వివిధ దశల్లో ఉన్నవి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇండ్లు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తైన ఇండ్లను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, వివిధ దశల్లో ఉన్న పనులను నెలలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు, పూర్తైనవి, మౌలిక సౌకర్యాల కల్పన వివరాలు సమర్పించాలన్నారు. పనులు ఏ దశలో ఉన్నాయనే వివరాలను స్పష్టంగా తెలియజేయాలని, పనుల వేగవంతానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని హౌసిం గ్ నోడల్ అధికారికి సూచించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలన్నారు. పెండింగ్ పనులకు సంబంధించి స్టేజీల వారీగా నివేదిక ఇవ్వాలని ఏజెన్సీలను ఆదేశించారు. ముందుగా సంగారెడ్డి మండలంలోని ఫసల్వాది, కంది, సదాశివపేటల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్తో కలిసి పరిశీలించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, హౌసింగ్ నోడల్ అధికారి తుమ్మ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు, ఆర్ఆండ్బీ ఈఈ సురేశ్, పంచాయతీరాజ్ ఈఈ జగదీశ్వర్, ఇంజినీర్లు పాల్గొన్నారు.
‘మనఊరు-మనబడి’ పనుల్లో వేగం పెరగాలి
సంగారెడ్డి జిల్లాలో ‘మనఊరు – మనబడి’లో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో విద్య, ఇంజినీరింగ్శాఖల అధికారులతో ‘మన ఊరు – మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ పనుల పురోగతిపై సమీక్షించారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల వారీగా ఇప్పటి వరకు పూర్తైన పనులు, ప్రస్తు తం పురోగతిలో ఉన్నవి, ఇంకా ప్రారంభం కానివి, టెండర్ దశలో ఉన్న పనులు, జాప్యానికి గల కారణాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని పభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో త్వరితగతిన పనులు పూర్తయ్యే లా చర్యలు చేపట్టాలన్నారు. పురోగతిలో ఉన్న పనులను వారంలోగా పూర్తి చేయాలని, ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభించి వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని, టెండర్ దశలో ఉన్న పనులకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కంది, కొండాపూర్, జిన్నారం, హత్నూర, న్యాల్కల్ మండలాల్లో పనులను పూర్తి చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయా ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్ను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్, పంచాయతీరాజ్, ఆర్ఆండ్బీ, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, ఇంజినీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.