సిద్దిపేట, ఆగస్టు 12: ‘ఉదయ్ నాగరాజు తన పేరుకు తగ్గట్టే సార్థకత చేసుకున్నాడు.. తెలంగాణలో ఉదయించి బ్రిటన్లో వెలుగొందుతున్నాడు… పల్లెటూరులో పుట్టి బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికయ్యే స్థాయికి ఎదగడం వెనుక ఆయన అపారమైన కృషి, పట్టుదలే కారణం… ఉదయ్ జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎన్నికైన సిద్దిపేట ముద్దుబిడ్డ ఉదయ్ నాగరాజుకు బుధవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో పౌరసన్మానం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వోడితెల సతీశ్కుమార్ మాజీ ఎమ్మెల్సీలు నారదాస్ లక్ష్మణరావు, ఫరూఖ్హుస్సేన్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జి.విరామకృష్ణరావుతో కలిసి హరీశ్రావు హాజరయ్యారు. ఈసందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంట్కు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజు, కేవలం 47 ఏండ్ల చిన్న వయసులోనే ఆదేశ చట్టసభకు ఎన్నికైన తొలి భారతీయుడు కావడం గర్వకారణమన్నారు. ఉదయ్ నాగరాజుతో రెండున్నర దశాబ్దాల అనుబంధం ఉందని హరీశ్రావు గుర్తుచేశారు.
లండన్లో ఉంటూ తెలంగాణ ఉద్యమానికి అంతే స్థాయిలో మద్దతు తెలిపి, తన వంతు భాగస్వామ్యం అందించారని కొనియాడారు. ఖండాంతరాలు దాటి ఎంత ఎదిగినా ఆయన ఒదిగే తత్వం అందరికీ ఆదర్శమన్నారు. ఉదయ్ నాగరాజుకు సన్మానం చేయడం అంటే సిద్దిపేట ప్రజలకు, తెలంగాణకే కాకుండా యావత్ భారతీయులకు గర్వకారణమన్నారు.
పౌరసన్మానం పొందిన ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ.. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా మట్టి మనిషినన్నారు. హరీశ్రావు ఆదరాభిమానాలు ఎప్పుడు మర్చిపోనన్నారు. ఇంగ్లాండ్ -ఇండియా ద్వైపాక్షిక సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయన్నారు. సిద్దిపేట నేలలో ఏదో ఉందని, ఇకడ కేసీఆర్, హరీశ్రావు లాంటి పెద్ద నాయకులు ఉన్నారన్నారు. ఈ మధ్యకాలంలో రెండు దేశాల మధ్య జరిగిన ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు స్వర్ణయుగం లాంటిదన్నారు. అందులో నేను ఒక సభ్యుడిగా కావడం గర్వకారణమన్నారు. నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ ప్రతి ప్రజాప్రతినిధికి అవసరమన్నారు. ప్రపంచం వేగంగా దూసుకెళ్తుండటంతో ప్రజాప్రతినిధులు సైతం అంతే వేగంతో ఆలోచించినప్పుడే ఆయా దేశాలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు 170 దేశాలు ఉన్న యుఎన్ పార్లమెంటరీ సమావేశంలో ఏఐ గురించి ప్రస్తావించి ఆలోచింపజేశానన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ప్రముఖ వైద్యులు రమాదేవి, రామచందర్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్రెడ్డి, ఉదయ్ నాగరాజు కుటంబసభ్యులు,బీఆర్ఎస్ హుస్నాబాద్ నాయకులు పాల్గొన్నారు.
ఉదయ్ నాగరాజ్ బంధువు అని నేను గొప్పగా చెప్పడం లేదు.. ఆయన అసాధారణ ప్రతిభతో బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎంపిక కావడం సంతోషకరం. ఆయన పనితీరును బ్రిటన్ పార్లమెంట్లో ప్రత్యక్షంగా చూశా. కామన్వెల్త్ ఎమ్మెల్యేల బృందంలో కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు. బ్రిటన్ పార్లమెంట్కు వెళ్లినప్పుడు మూడు రోజులు 14 మంది ఎంపీలతో జరిగిన సమావేశాల్లో నాగరాజు కీలక పాత్ర పోషించారు. ఉదయ్ నాగరాజు నేడు శాశ్వత సభ్యుడిగా ఎన్నిక కావడం సంతోషకరం.
– వొడితెల సతీశ్కుమార్, మాజీ ఎమ్మెల్యే
తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు ఎవరూ బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్కి ఎన్నిక కాలేదు. తెలంగాణ నుంచి మొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజు కావడం గర్వకారణం. సిద్దిపేట జిల్లా నుంచి కావడం మనకు గర్వకారణం. బ్రిటన్లో చదువుతున్న తెలంగాణవారికి ఆవసరమైన సహాయ సహకారాలు అందించాలి.
– యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
ఉదయ్ నాగరాజు బ్రిటన్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ శాశ్వత సభ్యుడిగా నియమితులు కావడం ఒక అసాధారణ విజయం. నేడు సిద్దిపేట ఆయన సాధించిన విజయాన్ని చూసి గర్వపడుతున్నది. ఎకడి శనిగరం ఎకడి హౌస్ ఆఫ్ లార్డ్స్ నాగరాజు ప్రస్తానం అద్భుతం.. శనిగరం మట్టిలో అక్షరాలు దిద్దుకొని సిద్దిపేటకు వస్తూ ఇకడి నుంచి హనుమకొండలో చదువుకొని ఆతర్వాత రామ్ టెక్ యునివర్సిటీలో కంప్యూటర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మూడు జిల్లాల ప్రజలకు గర్వకారణంగా నిలిచారు. దేశంలో ప్రఖ్యాతి పొందిన సురవరం ప్రతాప్రెడ్డి, జయశంకర్, కాళోజీ వంటి వారు సైతం ప్రజాఉద్యమాలతో మమేకమయ్యారు. తెలంగాణ నుంచి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడే స్థాయికి ఎదగడం అందరికీ ఆదర్శం.
– దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ