కొమురవెల్లి మల్లన్నపై అలక వహించిన కొండ పోచమ్మ అక్కడ వెలిసిందట. ఆపై సోదరుడు మల్లన్నను దర్శించుకున్న ప్రతి ఒక్కరు తనదాకా వచ్చిపోయే వరమిమ్మని కోరుకున్నదట. ఇలా ఆసక్తికరమైన స్థల పురాణం కలిగిన ఆ ఆలయం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్నర్సాపూర్ గ్రామంలో ఉంది. కొండ పోచమ్మగా ప్రసిద్ధిగాంచిన ఆ ఆలయం జాతరకు ముస్తాబైంది. జాతర ఈ నెల 22వ తేదీన ప్రారంభమయి ఉగాది వరకు 3 నెలలపాటు కొనసాగనున్నది.
జగదేవ్పూర్, జనవరి 21: తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన కొండపోచమ్మ ఆలయం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్నర్సాపూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయం సుమారు ఆరు దశాబ్దాల ఏళ్ల క్రితం చిన్నగా వెలిసి దినదినాభివృద్ధి చెందుతున్నది.
స్థల పురాణం…
కొండపోచమ్మ ఆలయం హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారికి మధ్య ఉన్న కొడకండ్ల గ్రామం నుంచి 16 కి.మీ, కొమురవెల్లి మల్లన్న ఆలయం నుంచి 9 కి.మీ దూరంలో ఉంది. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొమురవెల్లి మల్లన్నకు స్వయానా చెల్లెలని ప్రతీతి. కొన్ని వందల సంవత్సరాల క్రితం పోచమ్మ తల్లి అన్న మల్లన్నతో కొమురవెల్లి గుట్టలపై ఉండేదని భక్తులు చెప్తారు. ఒకానొక సందర్భంలో మల్లన్న చెల్లి పోచమ్మను కోప్పడ్డాడని, దానికి పోచమ్మ మల్లన్నపై అలకబూని తీగుల్ నర్సాపూర్ దట్టమైన అడవుల్లో స్థిర పడిందని స్థానికులు చెప్పుకుంటారు. తన చెల్లి జాడ కోసం వెతికి ఇంటికి వెళుదామని కోరగా ఆమె మొండికేసిందట. దీంతో చెల్లిని ఏవరం కావాలో కోరుకో అని చెప్పగా కొమురవెల్లికి వచ్చిన ప్రతి భక్తుడు తన వద్దకు వచ్చి దర్శనం చేసుకోవాలని కోరిందట. చెల్లి కోరిక మేరకు వరం ఇవ్వడంతో నాటి నుంచి పోచమ్మ స్థిరపడిన కొండ కొండపోచమ్మగా విరాజిల్లుతున్నది. మల్లన్న దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మను దర్శించుకుంటే సంతానం ప్రాప్తిస్తుందన్న నమ్మకం భక్తుల్లో ఉంది. హైదరాబాద్ జంటనగరాలతోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రతి ఏడు జాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు…
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ జంబుల శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ రజితా రమేశ్, ఈవో మోహన్రెడ్డి తెలిపారు. ప్రతి ఏడు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డితోపాటు కార్పొరేషన్ చైర్మన్లకు, జడ్పీ చైర్పర్సన్లకు ఆహ్వానం అందించామన్నారు. జాతరకు కుషాయిగూడ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సీసీ కెమరాలతో నిఘా ఏర్పాటు చేశామని ఎక్కడికక్కడ రూట్ మ్యాప్లు వేసి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.
జాతర ప్రత్యేకం.. బోనాలు
కొండపోచమ్మ జాతరకు వచ్చే భక్తులు తాము కోరిన కోరికలు తీరడంతో ముందుగా ఆలయం ముందున్న చెరువులో స్నానం ఆచరించి ఆలయ పరిసరాల్లో అమ్మవారికి నైవేద్యం వండి రంగురంగులు పూలతో అలంకరించిన ఎత్తైన బోనాలలో ఉంచుతారు. డప్పుచప్పుళ్లు శివసత్తుల పూనకాలు, యువతీ యువకుల నృత్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోసి నైవేద్యం సమర్పిస్తారు. హైదరాబాద్ నగర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో లష్కర్ బోనాలు ఎత్తుకొని డీజేలు ఏర్పాటు చేసి తొట్టెలను అమ్మవారి ప్రతిమలను అందంగా అలంకరించి ధూంధాంగా సందడి చేస్తూ వచ్చి ఆలయ ప్రాంగణంలో చెట్టుకు ముడుపులు కడుతారు. ఈ జాతరలో జోగిని శ్యామల బృందం ఎత్తైన బోనం ఎత్తుకొని చేసే నృత్యాలు ఆకట్టుకుంటాయి.