న్యాల్కల్, ఫిబ్రవరి 22: అప్పడే సమ్మర్ హీటెక్కిస్తోంది. ఉదయం నుంచే భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. అత్యవసరం అనుకుంటే ఉదయమే ప్రయాణమవుతున్నారు. ఇండ్లలో ఉండేవారు ఏసీలు, కూలర్లను పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. మరికొంత మంది చెట్ల కింద సేద తీరుతున్నారు. ఈసారి ఎండలు మండే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో మంచినీరే దివ్య ఔషధమని చెబుతున్నారు. ఎండ వేడిమితో శరీరం నుంచి చెమట రూపంలో నీరు ఎక్కవగా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి వడదెబ్బ తగలకుండా, ఎండ నుంచి ఉపశమనం కోసం తగు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్నారు. ఆహార పదార్థాలు వండేటప్పుడు నూనెలను తగ్గించాలి.
ఆకుకూరలు ఎక్కవగా తీసుకోవాలి. ఆవిరి కుడుములు ఇడ్లీలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచివి. కూల్డ్రింక్ కన్నా కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. కాఫీ, టీ వీలైనంత తక్కువగా తాగితే మంచిది. కర్బుజా, నిమ్మరసం, గ్లూకోజ్ నీళ్లు, సగ్గుబియ్యం నానబెట్టిన నీళ్లను తాగితే మంచింది. మజ్జిగ అన్నం, ఇండ్లల్లో కిటికీలు తెరిచి గాలి వచ్చేలా ఉంచుకోవాలి. కిటికీలు, గుమ్మాలకు వట్టి వేళ్లతో, కొబ్బరి నారతో చేసిన తెరలను తడిపి కట్టుకుంటే వేడి ఇండ్లలోకి రాకుండా చల్లదనాన్ని ఇస్తాయి. వేసవిలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తులను ధరించవద్దు. కాటన్తో తయారు చేసిన బట్టలను ధరిస్తే మంచిది. పగటి పూట బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు చలువనిచ్చే అద్దాలు, టోపీలను ధరించడం మంచిది. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండలో తిరిగితే త్వరగా డీహైడ్రేషన్కు గురై వ్యాధి తీవ్రతలు అధికమవుతాయి. ఆల్కహాల్, సిగరెట్, కార్బోనేటెడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండడం మంచిది. వీటితో శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే దూరం ప్రాంతాలకు ప్రయాణం చేస్తేనే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎండాకాలం ప్రజలు కాస్తంత జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు.