మత్తు పదార్థాల నియంత్రణలో భాగస్వాములు కావాలి
ఫార్మా పరిశ్రమలపై నిఘా పెంచాలి
డ్రగ్స్, గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు
పోలీసు, ఎక్సైజ్ శాఖలు సంయుక్త తనిఖీలు చేపట్టాలి
సమీక్షా సమావేశంలో సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్
సంగారెడ్డి, ఫిబ్రవరి 11 : మాదక ద్రవ్యాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతూ ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని ఎస్పీ రమణ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్, గుడుంబా నిర్మూలనపై పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ, అటవీ, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాలను నిర్మూలించాలని వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు. గంజాయి, గుడుంబా, డ్రగ్స్ విక్రేతలు, గంజాయి సాగు చేస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. జిల్లాలో గంజాయి సాగు రవాణా చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామన్నారు. మత్తు పదార్థాల విక్రయాలు, గంజాయి సాగుచేస్తే సమాచారం అందించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. గం జాయి, డ్రగ్స్, గుడుంబా తదితర మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాల గురించి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో డ్రగ్స్ నిర్మూలనకు పోస్టర్లు, కేబుల్ టీవీలతో ముమ్మర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తే ఆ గ్రామానికి రివార్డు ఇస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
విద్యార్థుల్లో అవగాహన పెంచాలి…
జిల్లాలోని విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ నిర్మూలనకు చైతన్యం కలిగించాలన్నారు. విదేశీ విద్యార్థులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు క్రాప్ బుకింగ్ను క్షుణ్ణంగా పరిశీలించాలని, గంజాయి అంతర పంటగా సాగు చేసే అవకాశం ఉందన్నారు. ఫార్మా కంపెనీలపై నిఘాపెట్టి ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. నిరంతరం బస్సులు, రైళ్లను తనిఖీ చేయాలన్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణలో రెవెన్యూ శాఖ కీలకం : అదనపు కలెక్టర్
మాదక ద్రవ్యాల నియంత్రణకు రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. విద్యాశాఖ అధికారులు ఆయా కళాశాలల విద్యార్థులపై దృష్టి సారించాలని, మత్తు పదార్థాల వినియోగంపై నిఘా ఉంచి గుర్తించాలన్నారు. అన్నిశాఖల అధికారులు అవగాహన సమావేశాలు నిర్వహించడంతో పాటు, ఎప్పటికపుడు పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. సమీక్షా సమావేశంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కేఎబీ శాస్త్రి, అసిస్టెంట్ కమిషనర్ రఘురాం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రీ, అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎస్పీలు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎక్సైజ్, అటవీశాఖల అధికారులు పాల్గొన్నారు.