మెదక్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): మెదక్ పట్టణంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా 2024లో ఏర్పాటు చేసిన నర్సింగ్ కళాశాల అద్దె భవనంలో కొనసాగుతున్నది. అద్దె భవనంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు నరకం అనుభవిస్తున్నారు. నర్సింగ్ కళాశాల మొదటి ఏడాది 60 సీట్లు ప్రభుత్వం కేటాయించింది. కళాశాలలో ప్రస్తుతం 120 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ప్రతి ఏడా ది 60 మంది విద్యార్థినులు కొత్తగా విద్యనభ్యసించేందుకు వస్తారు.
అద్దె భవనంలో 10 మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు నీటి సమస్య తీవ్రంగా ఉన్నది. విద్యాబోధన చేసేందుకు అధ్యాపకులు లేక ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న కొందరు ఇక్కడ విద్యాబోధన చేస్తున్నారు. 25 మంది బోధన సిబ్బంది అవసరం ఉండగా, పదిమంది మాత్రమే ఉన్నారు. కళాశాల పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి. పాములు సంచరిస్తున్నాయని విద్యార్థినులు తెలిపారు.
మెదక్ నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు వంట చేసేందుకు ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ప్రతి విద్యార్థి మెస్చార్జి నిమిత్తం ప్రతినెలా రూ. 3100 చెల్లిస్తున్నారు. వంట ఏజెన్సీకి నెలకు రూ. 2500 చొప్పున చెల్లించి, మిగతా రూ. 600 చొప్పున నర్సింగ్ కళాశాల వారు నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వంట ఏజె న్సీ వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
నర్సింగ్ కళాశాల విద్యార్థినులను ప్రతిరోజూ ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోవాల్సి ఉంటుంది. సర్కార్ దవాఖానలో విద్యార్థినులకు వైద్య చికిత్సల పై అవగాహన కల్పించేందుకు కళాశాల నుంచి ప్రైవేట్ బస్సులో తీసుకుపోతారు. ప్రతి విద్యార్థిని ప్రైవేట్ బస్సు కోసం నెలకు రూ. 500 చెల్లిస్తున్నారు. ప్రైవేట్ బస్సు కోసం ప్రతినెలా అధికారులు రూ. 60 వేలు వసూలు చేస్తున్నారని విద్యార్థినులు తెలిపారు. వసతి గృహం నిర్వహణ కోసం ప్రతి విద్యార్థిని నెలకు రూ. 350 చెల్లిస్తున్నా అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
అద్దె భవనంలో.. అసౌకర్యాల మధ్య నర్సింగ్ విద్య అభ్యసించడం నరకంగా మారిందని మెదక్లోని నర్సింగ్ కళాశాల విద్యార్థినులు వాపోతున్నారు.2024లో మెదక్లో నర్సింగ్ కళాశాల మంజూరు కాగా, సొంత భవనం లేక అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. అద్దె భవనంలో సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్య వేధిస్తున్నది. పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి. పాములు సంచరిస్తున్నాయి. భోజనం బాగుండడం లేదని, మెస్,ట్రాన్స్పోర్టు చార్జీలు చెల్లిస్తున్నా సేవలు బాగుండడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. పూర్తిస్థాయిలో బోధన సిబ్బంది లేక చదువు సరిగ్గా సాగడం లేదంటున్నారు. శుక్రవారం నర్సింగ్ విద్యార్థినులు ధర్నా చేయడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మెదక్ పట్టణంలోని నర్సింగ్ కళాశాలలో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అద్దె భవనంలో కళాశాల నడిపిస్తున్నా సౌకర్యాలు కల్పించడం లేదు. 120 మంది విద్యార్థినులకు 10 మరుగుదొడ్లు ఉన్నాయి. అందులో కొన్ని పనిచేయడం లేదు. మరుగుదొడ్ల కోసం రోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నీటి సౌకర్యం లేక ఇక్కట్లకు గురవుతున్నాం. మరుగుదొడ్ల సమస్యను పలుసార్లు ప్రిన్సిపాల్కు తెలిపినా పరిష్కరించడం లేదు.
– శ్యామల, నర్సింగ్ విద్యార్థిని, మెదక్
నర్సింగ్ కళాశాలలో మెస్చార్జీలు చెల్లించినా నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. వంట ఏజెన్సీ వారికి చెప్పినా పట్టించుకోవడం లేదు. అన్నం, పప్పుచారు వడ్డిస్తున్నారు. కూరగాయ వంటలు చేయడం లేదు. శుక్రవారం ధర్నా చేయడంతో కొందరు విద్యార్థినులు అన్నం తినలేదు. అన్నం మిగిలిపోవడంతో వంట ఏజెన్సీవారు రాత్రికి అదే అన్నం పెట్టారు. నాణ్యమైన భోజనం పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
– కార్తిక, నర్సింగ్ విద్యార్థిని, మెదక్
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వంట గది, మూత్రశాలలను శుభ్రం చేయడం లేదు. వంట గదిలో మురుగు కంపు వస్తుందని ప్రిన్సిపాల్కు తెలిపినా చర్యలు తీసుకోవడం లేదు. కళాశాల ఆవరణంలో మురుగుకాల్వ ప్రవహిస్తున్నది. దీంతో మురుగు నీరు నిల్వ ఉండి రోగాలకు గురవుతున్నాం. మురుగుకాల్వలో నీరు నిల్వ ఉండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యలు పరిష్కరించడం లేదు. వసతిగృహం నిర్వహణ కోసం ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తున్నాం. మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
– లావణ్య, నర్సింగ్ విద్యార్థిని, మెదక్
మెదక్ నర్సింగ్ కళాశాలకు అద్దె భవనం తీసుకొని ప్రతినెలా రూ. 1,89,828.38 అద్దె చెల్లిస్తున్నాం. అద్దె భవనం యాజమాన్యం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదు. భవనానికి మరమ్మతులు చేయాలని మూడు సార్లు నోటీసులు జారీ చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. తాగునీటి సమస్య ఉంటే పరిష్కరించాం. మరుగుదొడ్ల సమస్య ఉంది. మరుగుదొడ్లకు మరమ్మతులు చేయాలని కోరినా పట్టించుకోలేదు. ప్రైవేట్ వ్యక్తులను తీసుకువచ్చి మరమ్మతులు చేయించా. భవన యాజమాన్యం పట్టించుకోకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. సమస్యలపై వైద్యారోగ్యశాఖ అధికారులకు నివేదిక పంపించాం.
– కమలాదేవి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మెదక్