శివ్వంపేట, జూన్ 3: అమరుల త్యాగ ఫలంతో ఏర్పడిన తెలంగాణలో రైతులకు తోడు, నీడగా, ధైర్యంగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమేనని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఎం.రఘునందన్రావు అన్నారు. శనివారం శివ్వంపేట మండలం గోమారం రైతువేదికలో ఏర్పాటు చేసిన వ్యవసాయ దినోత్సవంలో మెదక్ కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు క్లస్టర్ పరిధిలోని 7 పంచాయతీల నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వచ్చిన రైతులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నం పెట్టే రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతుకు మేము తోడున్నామన్న ధీమా, ధైర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుబంధు, ఉచిత విద్యుత్, సాగు నీరు అందించడమే గాక మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ ఆదుకుంటున్నదన్నారు.
నేడు రైతు ధైర్యంగా గుండె మీద చేసుకుని నిద్రపోతున్నాడన్నారు. మెదక్ జిల్లాలోని 76 రైతు వేదికల్లో పండుగ వాతావరణంలో సంబురాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాడు గోమారం క్లస్టర్లో 1200 ఎకరాలు సాగవుతుండగా, నేడు 4,621 ఎకరాలు పెరిగిందని, మృతిచెందిన 68 మంది రైతుల కుటుంబాలకు రైతుబీమా అందించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశామన్నారు. నాడు ఎరువులకు ఎంతో గోస ఉండేదని, క్యూలో చెప్పులు పెట్టి పడిగాపులు కాసేవారన్నారు. తెలంగాణ వచ్చాక రైతులు నిశ్చింతగా, ధైర్యంగా ఎరువుల గురించి టెన్షన్ లేకుండా ఉంటున్నారన్నారు.
శివ్వంపేట మండలంలో అదనంగా మరో నాలుగు క్లస్టర్ల ఏర్పాటుకు, గోదాముల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీగా ఇస్తున్న రైతుబంధు దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మాడల్గా నిలిచిందన్నారు. జిల్లాలో కాళేశ్వరం జలాలతో సాగునీటి సౌకర్యం పెరిగిందని, నాడు 76 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే, నేడు నాలుగురెట్లు పెరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతన్న నష్టపోరాదనే సంకల్పంతో ప్రభుత్వం పంట కాలాన్ని ఒక నెల ముందుకు జరిపిందన్నారు. ఈ వానకాలం పంట జూన్ 25 నుంచి ప్రారంభించాలని రైతులకు సూచించారు. అనంతరం ‘మన తెలంగాణ.. దేశానికే అన్నపూర్ణ’ కరపత్రాన్ని, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఆ తరువాత దొంతిలో నూతన రైతు వేదికను ఎంపీపీ హరికృష్ణతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
వ్యవసాయంలో సమూల మార్పులు
సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయంలో సమూల మార్పులు వచ్చాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం గోమారంలోని రైతువేదికను సర్పంచ్ లావణ్యా మాధవ రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో రైతులు భూమికి బరువయ్యేంత పంటలు పండిస్తూ నేడు తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలిచేలా చేశారన్నారు. వ్యవసాయం దండుగ అన్న వారికీ పండుగలా చేశారన్నారు.
రైతును కంటికి రెప్పలా కాపాడుతూ రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీటి జలాలు అందిస్తూ అక్కున చేర్చుకున్నారన్నారు. నాటి, నేటి పరిస్థితులు మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయని, రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునే పరిస్థితులు ఉన్నాయని, ప్రజలు అభివృద్ధిని గమనించాలని వివరించారు. రత్నాపూర్, శివ్వంపేట రైతు వేదికలను ఆయా ప్రజాప్రతినిధులు ప్రారంభించి రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, ఆర్డీవో శ్రీనివాసులు, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, తహసీల్దార్ శ్రీనివాసాచారి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, ఎంపీటీసీ నర్సింహరెడ్డి, ఉప సర్పంచ్ కాముని శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు లాయక్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సుధీర్రెడ్డి, ఏఈఓలు, సర్పంచులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.