చేగుంట,అక్టోబర్17: క్రీడల్లో గెలుపోటములు సహజమని, నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంటలోని ఎస్టీ బాలికల గురుకుల స్పోర్ట్స్ పాఠశాలలో జోనల్ క్రీడలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించారు. చేగుంటలోని తెలంగాణ గిరిజన స్పోర్ట్స్ పాఠశాలలో నిర్వహించిన ఆరో జోనల్ లెవల్ క్రీడలకు వారు ముఖ్య ఆథితులుగా హాజరయ్యారు.
ఎంపీకి క్రీడాకారులు క్రీడా వందనంతో స్వాగతం పలికారు. ఈ క్రీడల్లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 14 బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 545 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అన్ని రకాల వసతులు కల్పిస్తూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారన్నారు. గిరిజన పాఠశాలలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొని జిల్లాకు పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీపీని, సర్పంచ్, ఎంపీటీసీ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, రీజినల్ కో-ఆర్డినేటర్ టి.సంపత్కుమార్, ప్రిన్సిపాల్ కె.మమత, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఎం.సుజాత, రమేశ్తో పాటు వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.