చేగుంట/పాపన్నపేట/టేక్మాల్/అల్లాదుర్గం/నర్సాపూర్/నిజాంపేట/రామాయంపేట, జనవరి 3 : ప్రభుత్వ ఉన్నత పాఠశాలల మండల స్థాయి పదో తరగతి విద్యార్థులకు సోషల్ ఫోరం అధ్వర్యంలో టాలెంట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ బత్తుల ఆశయ్య, కో-కన్వీనర్ శంషొద్దీన్ అన్నారు. మంగళవారం రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పదోతరగతి చదివే విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. సోషల్ టాలెంట్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మండల స్థాయిలో బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు.
నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో నస్కల్, నార్లపూర్, రాంపూర్, నిజాంపేట, కల్వకుంట గ్రామాల్లో ఉన్నత పాఠశాలల 29 మంది విద్యార్థులు ఈ టెస్టు పాల్గొన్నారని సోషల్ ఉపాధ్యాయులు అలీ, రమేశ్ తెలిపారు. నర్సాపూర్ మండలంలోని ఉన్నత పాఠశాలల నుంచి 70 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐ షేక్లాల్ మధార్, మండల విద్యాధికారి బుచ్చానాయక్ బహుమతులను ప్రదానం చేశారు. ప్రధానోపాధ్యాయుడు విట్టల్, సాంఘిక శాస్త్రం ఫోరం కన్వీనర్ వీరేశం, కో-కన్వీనర్ కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.