సిద్దిపేట రూరల్, డిసెంబర్ 6: పెండ్లంటే నూరేళ్ల పంట. ప్రతి వ్యక్తి జీవితంలో మరుపురాని మధుర ఘట్టం. లైఫ్ పార్ట్నర్తో కొత్త జీవితానికి నాంది పలికే శుభదినం. మరి ఆ ముచ్చట సాదాసీదాగా జరిగిపోతే ఎలా.. వివాహ వేడుకల్లో ఆనందకరంగా సాగే ప్రతి తంతూ జీవితాంతం మధర జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిందే. కాస్త వెలుగు.. జిలుగులు అద్దాల్సిందే. పెండ్లంటే తాలిబొట్లు, తలంబ్రాలు, పూలదండలు, ఆభరణాలు, వేదమంత్రాలు, సన్నాయిమేళాలు, షడ్రుచుల భోజనాలే కాదు.
ఇప్పుడు వెడ్డింగ్కు సినిమా షూటింగంత వైభవం వచ్చిందంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రతి తంతు ఇక కళాత్మకంగా మారింది. ఫొటో, వీడియో షూట్లకు అమాంతం ప్రాధాన్యం పెరిగింది. బుధవారం నుంచి పెండ్లి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. మే వరకు పెండ్లిండ్ల సీజన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫొటో, వీడియో గ్రాఫర్లు, పురోహితులు, కేటరింగ్ నిర్వాహకులు, సన్నాయి మేళ బృందాలకు డిమాండ్ పెరగనున్నది.
ఎన్నో హంగులు..
మంగళస్నానాలకు చేసే డెకరేషనే ప్రస్తుతం చిన్నసైజ్ పెండ్లి వేడుకలను తలపిస్తున్నాయి. పసుపు నీళ్లు వేసేందుకు అందాల జల్లెడ, సప్తవర్ణ శోభితమైన బిందెలు, మహారాజుల వైభవాన్ని గుర్తుకుతెచ్చే కంచుపాత్రలు, వాటిలో పన్నీరు కలిపిన నీళ్లు.. అందులో తేలియాడే రంగు రంగుల పూలు వన్నెలద్దుతున్నాయి.
పెండ్లి కుమారుడికి అలంకరించే మహరాజా తలపాగాలు, సంప్రదాయ టోపీలు, కాళ్లకు తొడిగే పాంకోళ్లు. రోళ్లు, రోకళ్లకు రకరకాల రంగులతో ముస్తాబు, పెండ్లి కుమార్తెకు కొత్త అందాన్ని తెచ్చి అలంకరించే పూలజడలు, ఖరీదైన జాకెట్లు చేతులకు కళాత్మక మెహందీలు, అందమైన మేకప్, పెండ్లికుమార్తెను తీసుకువెళ్లే బుట్ట, గొడుగు.. ఇలా వివాహ వేడుకలో ఎన్నో నూతన ఆకర్షణలు బంధుమిత్రులను కట్టిపడేస్తున్నాయి.
శాస్త్ర సమ్మతం కాదా.. అవునా.. అనే విషయాన్ని పక్కనపెడితే వివాహ సమయంలో వధూవరుల మధ్య ఏర్పాటు చేసే తెరను సైతం అందంగా తీర్చిదిద్దుతున్నారు ఈవెంట్ మేనేజర్స్. వాటిపై సీతారాములు లేదా, అలివేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామి వంటి చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. వాటిపై దేవతలను లేసు దారాల అల్లికలతో తీర్చిదిద్దుతుండడం విశేషం. వాటి వల్ల వివాహ సమయానికి దైవానుగ్రహం ప్రసరిస్తుందనే భావన కలిగిస్తున్నారు.
సమయంలో వధూవరుల చేతుల్లో పెట్టే కొబ్బరిబొండాలకు ముత్యాలు, పగడాలు, కెంపులతో కొత్త ఆకర్షణలు తీసుకువస్తున్నారు. వేడుకల్లో ఇప్పుడు సంప్రదాయ కర్పూర దండలు కొత్త రూపాల్లో కనువిందు చేస్తున్నాయి.
వాడే కొబ్బరి కురిడీలను సైతం నిర్వాహకులు అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక పెండ్లి మండపం ముస్తాబైతే చెప్పనక్కర్లేదు. ఈవెంట్ మేనేజర్స్ మండపం కోసం పూలను హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి పెద్ద ఎత్తున తెప్పిస్తున్నారు. కండ్లు మిరిమిట్లు గొలిపే లైటింగ్ సమకూరుస్తున్నారు.
ఫొటోషూట్లకు మంచి డిమాండ్
పెండ్లికుమార్తెల ముస్తాబు నుంచి కార్ల డెకరేషన్ వరకు వేడుకల్లో మార్పు వచ్చింది. ఫొటో షూట్లకు గతంలో కంటే డిమాండ్ పెరిగింది. ఇప్పుడు వధూవరుల అలంకరణ పెద్ద ఫ్యాషన్. మంగళ స్నానం, పెండ్లితంతులకు సినిమా ైస్టెల్లో ఫొటోషూట్స్ జరుగుతున్నాయి. పెండ్లి కుదిరి శుభలేఖ ప్రింట్ అయిన నాటి నుంచి వివాహ వేడుక ముగిసేవరకు ఫొటో, వీడియోగ్రాఫర్లకు పని దొరుకుతున్నది.
– గాంతుల శ్రీనివాస్యాదవ్, ఫొటోగ్రాఫర్, సిద్దిపేట