ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతి ఒక్కరి కల. వందల పోస్టులకు వేలమంది పోటీపడుతుంటారు. జాబ్ సాధించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.రాష్ట్రంలో 80వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని కొద్దిరోజుల కిందట సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగులు ప్రిపరేషన్ను ప్రారంభించారు. సొంతంగా ప్రిపేర్ అవుతున్న వారితో పాటు పోలీస్శాఖ, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రాల్లో ఇస్తున్న శిక్షణ కేంద్రాల్లో నిరుద్యోగ అభ్యర్థులు సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. సర్కారు జాబ్ కొట్టడమే లక్ష్యంగా సిద్ధమవుతున్నారు. పోలీస్శాఖలో భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ జారీ కావడంతో నిరుద్యోగుల్లో కోలాహలం నెలకొంది. రెట్టింపు ఉత్సాహంతో ప్రిపేరవుతున్నారు.
ఒకటి రెండు కాదు వేల కొలది కొలువులు ఊరిస్తున్నాయి. కష్టపడితే సర్కారు కొలువులో స్థిరపడవచ్చు. ఇలాంటి అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదే మంచి తరుణమని భావించి నిరుద్యోగ యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి తీవ్రంగా కృషిచేస్తున్నారు. దీనికోసం గంటల తరబడి చదువుతూ శ్రమిస్తున్నారు. వారి శ్రేయస్సు కోరి, బంగారు భవిష్యత్తు చూపడానికి పోలీస్శాఖ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మెటీరియల్ అందించడం, నిపుణులతో మంచి శిక్షణ ఇప్పించడంతో పాటు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తుండడంతో యువత శ్రద్ధతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ రావడంతో యువతలో జోష్ నెలకొంది. రెట్టింపు ఉత్సాహంతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 26( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మెదక్ : పోలీస్శాఖలో కొలువుల జాతర ప్రారంభం కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపరేషన్ను తీవ్రతరం చేశారు. జిల్లాలో పోలీస్శాఖ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆయా డివిజన్ కేంద్రాల్లో ఎంపిక చేసిన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉచితంగా మెటీరియల్ అందించడంతో పాటు నిపుణులతో మెరుగైన శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉచిత మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో శారీరక దారుఢ్యంపై శిక్షణ ఇస్తున్నారు.
సోమవారం పోలీస్ శాఖలో వివిధ క్యాడర్ల కింద రాష్ట్రంలో 16,027 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యువత హర్షం వ్యక్తం చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో సుమారుగా 630 సివిల్, 306 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇవి కాకుండా జోన్ల వారీగా ఎస్సై, ఆపై క్యాడర్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి కూడా జిల్లా అభ్యర్థులు పోటీ పడవచ్చు. సిద్దిపేట జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 109, ఏఆర్ 103, మెదక్ జిల్లాలో సివిల్ 100, ఏఆర్ 79, సంగారెడ్డి జిల్లాలో సివిల్ 421, ఏఆర్ 125.. మొత్తం ఉమ్మడి జిల్లాలో పరిధిలో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 630, ఏఆర్ కానిస్టేబుల్ 306 అన్ని కలుపుకొని 930 పోస్టులు భర్త్తీ కానున్నాయి. ఇవి కాకుండా జోన్ల వారీగా పోస్టులకు ప్రయత్నం చేసేందుకు అవకాశం ఉంది.
రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలో సిద్దిపేట, మెదక్ జిల్లాలో వస్తాయి. ఈ జోన పరిధిలో ఎస్సై పోస్టులు సివిల్ 35, ఏఆర్ 04, అగ్నిమాపక 04, సంగారెడ్డి జిల్లా చార్మినార్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ జోన్ పరిధిలో సివిల్ 180, ఏఆర్ 36, అగ్నిమాపక 06, మొత్తంగా రెండు జోన్లు కలుపుకొని సివిల్ 215, ఏఆర్ 40, అగ్నిమాపక 10, అన్ని కలుపుకొని 265 ఎస్సై పోస్టులు భర్తీ చేస్తారు. ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలకు వెబ్సైట్ ద్వార మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఉద్యోగాల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, సిలబస్ తదితర వివరాలను ఆ వెబ్సైట్లో పొందు పరిచారు. మూడేండ్ల గరిష్ట వయోపరిమితిని సడలింపు ఇవ్వడంతో నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఓసీ, బీసీ వర్గాలకు చెందిన స్థానికులైతే రూ.800, ఎస్సీ, ఎస్టీలైతే రూ. 400 చొప్పున దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
పోలీసు శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న జిల్లాలోని నిరుద్యోగులకు ఉచితంగా మెరుగైన శిక్షణ అందిస్తున్నాం. శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలి. శిక్షణకు సుమారు 2వేల మంది ఎంపికయ్యారు. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇంతస్థాయిలో పోస్టులు భర్తీ చేయనుండడం గొప్ప అవకాశం. యువత పట్టుదలతో ప్రయత్నించి జాబ్లు సాధించాలి.
-రోహిణి ప్రియదర్శిని, మెదక్ జిల్లా ఎస్పీ
పెద్ద ఎత్తున కొలువులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అభ్యర్థులంతా ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. స్థానిక అభ్యర్థులు తమ సొంత జిల్లా, జోన్ , మల్టీ జోన్లలో 95శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ఇతర జిల్లాలు, జోన్లు, మల్ట్టీ జోన్లలో 5శాతం ఓపెన్ కోటాలో ఉద్యోగాలకు పోటీపడే అవకాశం ఉంది. కొత్త జోనల్ వ్యవస్థ విధానంతో పాత వ్యవస్థ పూర్తిగా రద్దయింది. ఇన్నాళ్లు ఉన్న జోనల్ వ్యవస్థ ద్వారా జిల్లా నుంచి రాష్ట్రస్థాయి కేడర్ వరకు స్థానికేతురులు భారీగా పోస్టులు తన్నుకొని పోయేవారు. కొత్త విధానం ద్వారా ఈ వ్యవస్థ పూర్తిగా మారిపోయి స్థానికులకు ప్రయోజనం కలుగుతుంది. జిల్లా, జోనల్, బహుళ జోన్ పరిధిలో జరిగే ప్రత్యక్ష నియామకాల్లో 95శాతం పోస్టులు స్థానికులకే దక్కుతాయి.
ఆ లెక్కన గతంలో జరిగిన భర్తీ విధానంతో పోల్చిచూస్తే జిల్లా స్థాయి పోస్టుల్లో అదనంగా 15శాతం పోస్టులు స్థానికులకు దక్కతాయి. జోనల్ కేడర్లో 25 శాతం, బహుళ జోన్ పరిధిలో 35శాతం పోస్టులు స్థానికులకు దక్కనున్నాయి. జిల్లా, జోనల్, బహుళ జోన్ పరిధిలో కేవలం 5శాతం మాత్రమే స్థానికేతర రిజర్వేషన్లు ఉంటాయి. ఇందులోనూ మన స్థానికులు పోటీపడవచ్చు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ శిక్షణకు జిల్లా పోలీస్ బాస్ల నేతృత్వంలో నిష్ణాతులతో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణను ఇప్పిస్తున్నారు. ప్రతి కేంద్రం నుండి దరఖాస్తులు స్వీకరించి వారిక ప్రత్యేక రాత పరీక్షను డివిజన్ల వారీగా ఏర్పాటు చేసి అందులో అర్హులను గుర్తించి శిక్షణను ఇస్తున్నారు.
పోలీసు ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో కోచింగ్లో చేరా. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేందుకు ఎస్సైగా ఉద్యోగం సాధిస్తా. శాంతిభద్రతలను కాపాడే పోలీస్ ఉద్యోగం చేయాలనే తపనతో కోచింగ్ తీసుకున్నా. బీసీ స్టడీ సర్కిల్లో ఉత్తమ నైపుణ్యం కలిగిన శిక్షకులతో శిక్షణ ఇవ్వడం చాలా బాగుంది. తెలంగాణ సర్కారు పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ప్రజలకు సేవ చేసి ఉత్తమ పోలీస్గా ప్రశంసలు పొందాలని ఆశా.
– శ్రావణి, ఇస్మాయిల్ ఖాన్పేట
గ్రూప్స్ ఉద్యోగం సాధించేందుకు కోచింగ్ తీసుకున్న. పోటీ పరీక్షలు అనగానే ప్రైవేట్ కోచింగ్లకు పరుగులు తీసే నిరుద్యోగులు ప్రభు త్వం ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్ కోచింగ్ను వినియోగించుకోవాలి. ఆర్థికంగా వెనుకుబడిన తరగతుల అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పా టు చేసింది. గెజిటెడ్ ఉద్యోగం సాధించేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తా. నాతోటి అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలవాలన్నదే కోరిక.
– శివాజీ, జిల్లా కేంద్రం సంగారెడ్డి
పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికకావడానికి కోచింగ్లో చేరా. బీసీ స్టడీ సర్కిల్లో పేద వర్గాల అభ్యర్థులకు ఇస్తున్న ఉచిత కోచింగ్ ఎంతో ఉపయోగకరం. ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఇప్పటి వరకు తీసుకున్న శిక్షణతో కానిస్టేబుల్ ఉద్యోగం సాధిస్తా.. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సేవలు అందిస్తూ ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేస్తా. పట్టుదలతో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు ప్రయత్నిస్తా.
– నవనీత, కానిస్టేబుల్ అభ్యర్థి, హసన్ మామిడిపలి,్ల టెక్మాల్ మండలం
కష్టపడి చదివి పోలీసునవుతా. మెదక్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత శిక్షణకు హాజరవుతున్నా. శిక్షణలో అన్ని మెలకువలు నేర్పిస్తున్నారు. శిక్షణ అనంతరం మధ్యాహ్నం సమయంలో భోజనం కూడా పెడుతున్నారు.
-నాగరాణి, ర్యాలమడుగు, మెదక్ మండలం
ఏ ప్రభుత్వంలో కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చిన రోజులు లేవు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ఉచితంగా శిక్షణను ఇస్తోంది. చాలా సంతోషంగా ఉంది. ఉచిత శిక్షణ ఇస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మా అమ్మానాన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా. తప్పకుండా ఎస్ఐ ఉద్యోగం సాధిస్తా.
-సునీత, అభ్యర్థి, అప్పాజిపల్లి
పట్టుదలతో చదివి తప్పకుండా పోలీసు ఉద్యో గం సాధిస్తా. శిక్షణను అనుభవజ్ఞులైన వారితో ఇస్తున్నారు. శిక్షణ అనంతరం ఇంటి వద్ద చదువుకుంటున్నా. సీఎం కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడంతో చాలా సంతోషం అనిపించింది.
రఘువరన్, ఎల్లాపూర్, పాపన్నపేట మండలం