చేర్యాల, మార్చి 9: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం కార్యక్రమాన్ని శుక్రవారం అర్ధరాత్రి వైభవంగా నిర్వహించారు. భక్తులు మహా శివరాత్రి జాగరణ, పెద్దపట్నం కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 50 వేల వరకు భక్తులు రావడంతో గంటల తరబడి క్యూలో ఉండి రాత్రి పొద్దుపోయే వరకు స్వామిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు గుట్టపైన ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు.
నయనానందకరం పెద్దపట్నం
పంచ రంగులతో తయారుచేసిన పెద్దపట్నం వద్ద జానపద రీతిన పాటలు పాడుతూ, స్వామిని స్త్తుతిస్తూ ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహా శివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలం రాత్రి 12గంటలకు మల్లికార్జున స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ అర్చకులు రాజగోపురం, రాతిగీరలు తదితర ప్రాంతాల్లో ఊరేగించి తిరిగి ఆలయంలోకి తీసుకుపోయారు. అనంతరం ఒగ్గు పూజారులు రాత్రి 12గంటలకు మొదటగా గంగాస్నానం, పన్నెండున్నరకు బియ్యాన్ని సుంకు పట్టడం, ఒంటిగంటకు మైలపోలు, అనంతరం రాత్రి 2గంటల ప్రాంతంలో ఒగ్గు పూజారులు భక్తిశ్రద్ధలతో 42 వరుసలతో పెద్దపట్నం తయారుచేశారు. అనంతరం స్వామివారికి బోనం నివేదనగా చెల్లించగానే, ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి వేకువజామున పెద్దపట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పట్నం దాటారు. ఆ తర్వాత భక్తులు పెద్దపట్నం దాటి ఆలయంలో స్వామిని దర్శించుకున్నారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి వేడుకలకు హాజరయ్యారు. ఆలయ ఈవో బాలాజీ, ఆలయ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్లు నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజారులు ఉత్సవం విజయవంతం చేశారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
నేడు 8వ ఆదివారం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. మల్లన్న క్షేత్రంలో మొక్కులు చెల్లించుకున్న అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ బోనాలు సమర్పిస్తారు. భక్తుల కోసం ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
భక్తులపై పోలీసుల స్వల్ప లాఠీచార్జి
కొమురవెల్లి మల్లన్న భక్తులపై పోలీసులు, ఎన్సీసీ కెడెట్లు స్వల్ప లాఠీచార్జి చేశారు. పట్నం వేయడం పూర్తికాగానే ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పట్నం వద్ద పూజలు నిర్వహించి వెళ్లిపోగానే, ఒక్కసారిగా భక్తులు పట్నం పైకి దూసుకువచ్చారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, ఎన్సీసీ కెడెట్లు భక్తులపై లాఠీలు ఝళిపించారు.