పటాన్చెరు, మార్చి 9: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో రూ. 104.24 కోట్లతో నిర్మించిన జీరో డిస్చార్జ్ కామన్ ఇఫ్ల్య్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (జడ్ఎల్డీ-సీఈటీపీ)ని శనివారం మంత్రు లు దామోదర రాజనర్సింహ, కొండాసురేఖ, శ్రీధర్బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు పారిశ్రామికవేత్తల సహకారంతో దీనిని నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. పాశమైలారంలో నిర్మించిన ఈ ప్లాంట్తో చిన్న పరిశ్రమల వ్యర్థాలను శుద్ధి చేస్తారన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత ప్రజలను కాలుష్యం బారినుంచి రక్షించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు తెలిపారు. 60 రసాయన పరిశ్రమల వ్యర్థాలు ఇక్కడ శుద్ధి చేస్తారన్నారు. పారిశ్రామికవేత్తలు సీఎస్సార్ ఫండ్ ద్వారా విరివిగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఫైర్స్టేషన్లోని సిబ్బందికి పారిశ్రామికవేత్తలే వేతనాలు ఇచ్చి నియమించుకోవాలని, స్కిల్ డెవలప్మెంట్కు సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమల్లో కార్మికులు ప్రమాదాల బారినపడకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పారిశ్రామికవాడల్లో పరిశ్రమల కోసం ఉద్దేశించిన స్థలాల్లో పరిశ్రమలే ఏర్పా టు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఎస్ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… కాంగ్రెస్ సర్కారు పారిశ్రామికవేత్తలకు అండ గా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరంగల్లోనూ ఇలాంటి సీఈటీపీ నిర్మిస్తున్నారన్నారు. ఫైర్స్టేషన్లో సిబ్బంది నియామకం గురించి సీఎంతో చర్చిస్తానన్నారు. సీఎస్సార్ నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఎంప్లాయిమెంట్ కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు సహకరించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. పర్యావరణ అనుకూల పరిశ్రమలు ఏర్పాటు కావాలని, పరిశ్రమల ఏర్పాటుతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు.
మంత్రుల మధ్య సమన్వయలోపం
పాశమైలారంలోని సీఈటీపీని ప్రారంభించేందుకు తనకు ఆహ్వానం పంపకపోవడంపై జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఉదయం 10గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం ఆలస్యమైంది. మంత్రులు, స్పీకర్కు ఈ విషయం తెలియడంతో వారు హైదరాబాద్లోనే ఆగిపోయారు. జిల్లా మంత్రి దామోదర నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబుకు తెలియడంతో వారు కార్యక్రమానికి బయలుదేరి మధ్యలోనే రింగ్రోడ్డు నుంచే వెనుదిరిగినట్లు తెలిసింది. వారు రావడానికి ఇష్టపడడం లేదని తెలియడంతో నిర్వాహకులు, పారిశ్రామికవేత్తలు అందరితో మాట్లాడి కార్యక్రమానికి వచ్చేలా చేశారు. కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ ముందుగా వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ వచ్చారు. వారంతా మంత్రి శ్రీధర్బాబు కోసం చాలా సమయం వేచి చూసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో సీఈటీపీ సంస్థ నిర్వాహకులు, ఐలా అధ్యక్షుడు మంత్రులకు వేదికపై నుంచే క్షమాపణలు కోరారు. మంత్రి దామోదర రాజనర్సింహ కూడా తన స్పీచ్లో పొరపాట్లు మానవ సహజం అని నిర్వాహకులకు సుతిమెత్తగా చురకలు అంటించారు. మధ్యాహ్నం 1.15కి మంత్రి శ్రీధర్బాబు రావడంతో మంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు వేదిక దిగి సీఈటీపీ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం మంత్రులు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, కలెక్టర్ వల్లూరు క్రాంతి, రీ సుైస్టెనబిలిటీ సంస్థ డైరెక్టర్ గౌతమ్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, పి.మధుసూదన్రెడ్డి, శ్యామ్సుందర్రెడ్డి, కాట శ్రీనివాస్గౌడ్, ఎల్.సుధాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.