సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 29: పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసిందని, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ వివరాలు వెల్లడించారు. ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించగా, 26న నామినేషన్ల పరిశీలన పూర్తయిందని గుర్తుచేశారు. మొత్తం 40 మంది అభ్యర్థులు 68 నామినేషన్లు దాఖలు చేయగా, స్క్రూటినీ తర్వాత 26మంది అభ్యర్థులు బరిలో నిలిచారని, అందులో సోమవారం ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుకున్నట్టు పేర్కొన్నారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, ముగ్గురు అభ్యర్థులు జాతీ య గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్కుమార్, బీజేపీ నుం చి బీబీ పాటిల్, కాంగ్రెస్ నుంచి సురేశ్కుమార్ షెట్కార్ బరిలో నిలిచారని తెలిపారు. ఆరుగు అభ్యర్థులు రిజిస్టర్డ్డ్ పొలిటికల్ పార్టీ అభ్యర్థులు బరిలో నిలవగా, అందులో తెలంగాణ ప్రజాశక్తి పార్టీ అభ్యర్థి కొత్త బలిజ బస్వరాజ్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రుర్రపు మచ్చేందర్, అలియెన్స్ ఆఫ్ డెమొక్రెటిక్ రీఫార్మ్స్ అభ్యర్థి చవగని మణి, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి టీడీఎస్ మణి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అభ్యర్థి మల్లెపు మోహన్రెడ్డి, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి రోమల బాబు దుర్గయ్య ఉన్నారని, మిగతా 10మంది స్వతంత్రులు ఉండగా, వారిలో అశోక్ తలారి, కమ్మరి ఆనందీశ్వర్, జైపాల్ నాయక్ జడవత్, మహమ్మద్ సద్దాం, మహదేవ్స్వామి మఠం, బి.మారుతిరావు, ఎండీ యాకూబ్షరీఫ్, రమేశ్ సజ్జాపూర్, ఎస్.రాజు, సత్యనారాయణగౌడ్ కోవురి బరిలో ఉన్నారని తెలిపారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో నిలవడంతో రెండు బ్యాలెట్ మిషిన్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 16,40,755 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. అందులో 8,01,563 మంది పురుషులు, 8,39,133 మంది మహిళలు, 59 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని పేర్కొన్నారు. మే 13న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5వరకు పోలిం గ్ జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలోని ప్రతిఒక్కరూ ఓటు వేయాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయాలన్నారు. 85 ఏండ్లు పైబడిన వృద్ధులు, 40శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేయనున్నటు పేర్కొన్నారు. ఓటర్లు 12 గుర్తింపు పొందిన కార్డుల్లో ఏదేని కార్డుతో ఓటు వేయాలన్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ కిట్లు, ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ట్రైనీ కలెక్టర్ పాల్గొన్నారు.
మెదక్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): మెదక్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఎన్నికల బరిలో 44 మంది నిలిచారు. ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 54 మంది 90 నామినేషన్లు సమర్పించారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థి కళ్లు నర్సింహులుగౌడ్ నామినేషన్ను తిరస్కరణకు గురైంది. 53 మంది నామినేషన్లను ఆమోదించారు. సోమవారం 9 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో నిలిచిన వారిలో 15 మంది అభ్యర్థులు వివిధ జాతీయ, రాష్ట్రీయ గుర్తింపు పొందిన పార్టీల వారు కాగా, 29 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్రావు పోటీలో ఉన్నారు.