అమ్మా చెత్తబండి వచ్చిందమ్మా… చెత్తబండి… తడిచెత్త.. పొడిచెత్త… వేరుచేసి తీసుకురండమ్మా… రండమ్మా.. రండమ్మా… ఇదీ నిత్యం హుస్నాబాద్ పట్టణంలో వీధివిధీనా వినిపించే పాట… తెల్లవారుతుండగానే ఇంటిముందు చెత్తబండి వచ్చి ఇంట్లోని చెత్తను తీసుకువెళ్లి… ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపోస్ట్షెడ్, డీఆర్సీసీ కేంద్రాలకు తరలిస్తూ స్వచ్ఛ పట్టాణానికి బాటలు వేస్తున్నది హుస్నాబాద్ మున్సిపాలిటీ.
హుస్నాబాద్టౌన్, జూలై 17: గుట్టల్లా ఉన్న చెత్తను వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. దీంతో చెత్తగుట్టలు తగ్గిపోవడంతో పాటు చెత్తను సద్వినియోగం చేసుకుంటూ ఆదాయం సమకూర్చే మార్గానికి హుస్నాబాద్ మున్సిపల్ శ్రీకారం చుట్టింది. ఇంట్లో తయారైన చెత్తను తీసుకువెళ్లే వాహనాలు లేక.. ఆచెత్తను ఇంటిముందు.. పక్కన వేయడం, కాల్చివేయడం చేయాల్సిన పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత పరిశుభ్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో హుస్నాబాద్ పట్టణం స్వచ్ఛపట్టణంగా మారింది. ఒకప్పుడు మూడు వాహనాలు మాత్రమే ఉన్న హుస్నాబాద్ మున్సిపాలిటీలో నేడు పదకొండుకు పైగా వాహనాలు ఏడువేల ఇండ్లనుంచి చెత్తను నిరంతరం సేకరిస్తున్నాయి.
ఇంటింటికీ చెత్తబండి…
పదిహేను రోజులకు ఒకసారి మురుగుకాల్వలు శుభ్రం చేసిన తర్వాత నిరంతరం ఇంటింటికీ వచ్చి చెత్తను సేకరించే స్థాయికి తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలను అభివృద్ధి చేసింది. చెత్తను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలను సైతం అందించడమే కాకుండా సంబంధిత సిబ్బందిని నియమించి పట్టణాలను పరిశుభ్రమైన పట్టణాలుగా తీర్చిదిద్దుతున్నది. ఇందులో భాగంగా పట్టణంలోని ఏడువేలకు పైగా ఇండ్లకు 11వాహనాలు వెళ్లి నిరంతరం చెత్తను సేకరిస్తూ ప్రత్యేక షెడ్లకు తరలిస్తున్నాయి. వీటికితోడు మరింత మంది పారిశుద్ధ్య సిబ్బంది రహదారులను శుభ్రం చేయడం, మురుగుకాల్వలో చెత్తను తీసి వాటిని తొలగించే పనిని నిరంతరం నిర్వహిస్తుండటంతో స్వచ్ఛ పట్టణంగా మారుతున్నది.
కోటి రూపాయలతో ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం
పట్టణంలోని ఇండ్లనుంచి నిత్యం వస్తున్న చెత్తను ఒకచోట పోయకుండా ఆ చెత్తను పలు వాహనాల్లో మహ్మాదాపూర్ రోడ్డులో మూడు ఎకరాల స్థలంలో నిర్మించిన షెడ్లకు తరలిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘంతోపాటు ఇతర గ్రాంట్లకు చెందిన కోటిరూపాయలతో ప్రత్యేక కంపోస్ట్ షెడ్డు, డీఆర్సీసీ షెడ్లు నిర్మించారు. ఈ షెడ్లకు నిత్యం రెండు మెట్రిక్ టన్నులకు పైగా చెత్తను తీసుకువచ్చి దాన్ని సేంద్రియ ఎరువుగా తయారుచేస్తున్నారు. అలాగే పొడిచెత్తకు సంబంధించిన పలు వస్తువులను తిరిగి ఉపయోగించేందుకు వాటిని వేరుచేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతిచేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
మొక్కల పెంపకం కోసం…
స్థానిక కంపోస్ట్ షెడ్లో తయారవుతున్న చెత్తను మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నారు పారిశుధ్య్య సిబ్బంది. ఎవరైనా రైతులు సేంద్రియ ఎరువుకోసం వస్తే వారికి కిలోకు రూ.10 చొప్పున వినియోగిస్తున్నారు. పట్టణంలో సేకరించిన తడి, పొడిచెత్తను ఎక్కడ కూడా వృథా కానివ్వడంలేదు.
స్వచ్ఛ సర్వేక్షణలో మూడుసార్లు అవార్డులు….
పరిశుభ్రతతోపాటు చెత్తను వృథాకానివ్వకుండా చేస్తున్న హుస్నాబాద్ మున్సిపాలిటీ మూడేండ్లలో మూడు అవార్డులు దక్కించుకున్నది. 2022లో కేంద్ర ప్రభుత్వం ద్వారా బెస్ట్సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్, 2023లో ఫాసెస్ట్ మూవర్స్సిటీ, 2023లో రాష్ట్రప్రభుత్వం చేత అస్పిరేషన్టాయిలెట్స్ అవార్డు సొంతం చేసుకుంది.
హుస్నాబాద్ను అన్నింటా అభివృద్ధి చేస్తున్నాం
సరైన వసతులులేని హుస్నాబాద్ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే చెత్తకు సంబంధించిన షెడ్లు నిర్మించి చెత్త సమస్య పట్టణంలో లేకుండా చేశాం. పట్టణానికి అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు ఇస్తూ అభివృద్ధి పనులు వేగంగా సాగేలా చేస్తున్నాం. హుస్నాబాద్ పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఇతర పట్టణాలతో పోటీపడేలా చేస్తాం.
– వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్యే హుస్నాబాద్
పొద్దుగాలనే చెత్తబండి వస్తుంది
మా ఇంటికి పొద్దుగాలనే చెత్త బండి వస్తంది. ఆరున్నరకే రోజు వస్తది. కూరగాయల పొట్టును మా ఇంట్ల గులాబీచెట్లకు పోసుకుంటున్నం. మిగిలిన చెత్తను చెత్తబండికి ఇస్తున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి చెత్తబండి వస్తున్నది. స్వచ్ఛహుస్నాబాద్ కోసం ప్రభుత్వం కృషిచేయడం సంతోషకరం.
-గడ్డం మల్లిక, హుస్నాబాద్